వైసీపీ హయాంలో విశాఖలో ఏ స్థాయిలో భూ కుంభకోణాలు జరిగాయో చెప్పనక్కర్లేదు. ఐతే తాజాగా కూటమి ప్రభుత్వం ఈ అక్రమాలపై చర్యలు ప్రారంభించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు విశాఖలోని ఎండాడలో చేసిన 12.51 ఎకరాల భూకేటాయింపుల్ని..కూటమి ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.250 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. వృద్ధాశ్రమం, అనాథశరణాలయం నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి రాయితీపై భూమి తీసుకుని, ఆ ప్రాజెక్టులు చేపట్టకపోగా, హయగ్రీవ సంస్థ అడుగడుగునా అక్రమాలకు పాల్పడిందని, నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమితో స్థిరాస్తి వ్యాపారం చేసిందని ప్రభుత్వం గుర్తించింది. ఆ భూముల్ని వెనక్కు తీసుకుని, ప్రజా అవసరాలకు వినియోగించాలని విశాఖ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది.
హయగ్రీవ భూకుంభకోణంలో వైసీపీ నేత, విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ, మాజీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితుడైన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావులది కీరోల్. దీనిలో భారీ కుంభకోణం జరిగిందని నిర్ధారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్..ఎంవీవీ, జీవీలతో పాటు హయగ్రీవ ప్రాజెక్టు అసలు యజమాని చిలుకూరి జగదీశ్వరుడు, మేనేజింగ్ పార్ట్నర్ గద్దె బ్రహ్మాజీ సహా పలువురికి చెందిన రూ. 44 కోట్ల 74 లక్షల విలువైన ఆస్తులను ఇటీవల జప్తు చేసింది.
వైఎస్ హయాంలో మొదలై..జగన్ పాలనలోనూ అనేక మలుపులు తిరిగిన హయగ్రీవ భూ కుంభకోణంలో అడుగడుగునా వైసీపీ నేతల మోసం, కుట్ర కనిపిస్తాయి. ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ మోసాలను వివరించింది. ఏపీ ప్రభుత్వం వర్సెస్ మదనపల్లె ఎక్స్సర్వీస్మెన్ అసోసియేషన్ కేసులో హైకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని..హయగ్రీవ భూకేటాయింపుల్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. విశాఖలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు చేసిన దసపల్లా, NCC వంటి అనేక భూ కుంభకోణాలపైనా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది.
ఓల్డేజ్ హోమ్, అనాథ శరణాలయం ఉచితంగా నిర్మించి, నిర్వహించడంతో పాటు వృద్ధులు సౌకర్యంగా నివసించేందుకు వీలుగా కాటేజీలు నిర్మిస్తామని, ఇందుకు విశాఖలో భూమి కేటాయించాలని హయగ్రీవ సంస్థ 2006లో దరఖాస్తు చేసింది. ఆ సంస్థకు ఎకరం రూ.1.50 కోట్ల చొప్పున కేటాయించవచ్చని అప్పటి కలెక్టర్ సిఫారసు చేశారు. అయితే వృద్ధులు, అనాథల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అన్న కారణం చూపించి 2008 జూన్ 12న అప్పటి వైఎస్ ప్రభుత్వం ఎకరం రూ.45 లక్షల చొప్పున మొత్తం 12.51 ఎకరాల్ని కేటాయించింది. 10 శాతం భూమిలో ఆ సంస్థ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించాలన్నది నిబంధన. 60 శాతం భూమిలో వృద్ధుల అవసరాలకు తగ్గట్లుగా కాటేజీలు నిర్మించి 60 ఏళ్లు పైబడినవారికి విక్రయించాలి. 30 శాతం భూమిని మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి.
ఐతే హయగ్రీవ సంస్థ 2008లోనే భూకేటాయింపులు పొందినప్పటికీ అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు. ప్రభుత్వం చర్యలు తీసుకుందామనుకునేసరికి ఆ సంస్థ కోర్టుకెళ్లేది. కోర్టు ఆదేశాల ద్వారా ప్రాజెక్టు కొనసాగించేందుకు ఆ సంస్థకు పలు అవకాశాలు వచ్చినా కూడా..ఆలస్యం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పట్లో ఎంపీగా ఉన్న MVV సహా పలువురు నేతల కన్ను హయగ్రీవ భూములపై పడింది. జగదీశ్వరుడిపై ఒత్తిడి తెచ్చి గద్దె బ్రహ్మాజీ అనే వ్యక్తిని ఆ ప్రాజెక్టులో భాగస్వామిగా చేర్చారు. ఆయనకు 75 శాతం వాటా ఇచ్చేలా చేశారు. అనంతరం ఆ భూమిని MVVకి అత్యంత సన్నిహితుడైన GVకి బ్రహ్మాజీ GPA చేశారు. అక్కడ వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మించకపోగా నిబంధనల ప్రకారం వృద్ధులకు కాటేజీలు నిర్మించాల్సిన 36,329 చ.గజాల్లో 32,857 గజాల్ని ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. తనను భయపెట్టి ఆ భూమిని ఎంవీవీ, జీవీ చేజిక్కించుకున్నారని, బ్రహ్మాజీని వారే మేనేజింగ్ పార్ట్నర్గా చేర్చి తనకు తెలియకుండా కొన్ని భూములు అమ్మేశారని 2021 డిసెంబరులో జగదీశ్వరుడు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తర్వాత మళ్లీ వారంతా కలిసిపోయి అక్రమ దందా కొనసాగించారు.
వృద్ధులకు అన్ని రకాల వసతులతో కాలనీ నిర్మిస్తామని చెప్పి భూ కేటాయింపులు పొంది, ఆ లక్ష్యాన్ని పక్కనపెట్టి, జీవీఎంసీ నుంచి పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే హయగ్రీవ సంస్థ వ్యాపార ప్రయోజనాల కోసం ఆ భూమిని వేరొకరికి బదలాయించింది. ఇది ముమ్మాటికీ స్థిరాస్తి వ్యాపారమే. ఏ అవసరాల కోసం ఆ భూమిని తీసుకుందో దాన్ని హయగ్రీవ నెరవేర్చలేదు. కాబట్టి ఆ సంస్థకు భూ కేటాయింపులు రద్దు చేయాలంటూ 2022 జనవరి 4న అప్పటి జిల్లా కలెక్టర్ మల్లికార్జున రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు. ఐతే వైసీపీ పెద్దలు అదే కలెక్టర్పై ఒత్తిడి తెచ్చి హయగ్రీవ సంస్థకు గ్రీన్సిగ్నల్ ఇప్పించారు. ఆ సంస్థకు 2018లో జారీ చేసిన NOC సరిపోతుందని, దాని ఆధారంగా GVMC అనుమతులు ఇవ్వొచ్చని ఆయనతోనే చెప్పించారు. కలెక్టర్ లేఖ ఆధారంగా..2023 మే 3న GVMC అధికారులు హయగ్రీవ ప్రాజెక్టుకు ఒక్క రోజులోనే తుది అనుమతులన్నీ ఇచ్చేశారు. హయగ్రీవ సంస్థ అక్కడ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టింది.
ఐతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంవీవీ, జీవీ, గద్దె బ్రహ్మాజీలపై 2024 జూన్లో ఆరిలోవ పోలీస్స్టేషన్లో చిలుకూరి జగదీశ్వరుడు మళ్లీ ఫిర్యాదు చేశారు. తనను భయపెట్టి MOU పేరిట ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించి రూ.500 కోట్ల విలువైన భూములు లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ED గత ఏడాది అక్టోబరు 19, 20 తేదీల్లో పలుచోట్ల సోదాలు చేసింది. గద్దె బ్రహ్మాజీ ద్వారా హయగ్రీవ ప్రాజెక్టును గుప్పిట్లోకి తీసుకున్న తర్వాత ఎంవీవీ, జీవీలు 2021, 2022 సంవత్సరాల్లో 30 కంటే ఎక్కువ సేల్డీడ్లు, అమ్మకపు ఒప్పందాలు చేసుకున్నారు. తద్వారా రూ.87.64 కోట్ల ఆదాయం పొందారు. ఆ ఆదాయాన్ని MVV, బ్రహ్మాజీ, వారణాసి దిలీప్లు సొంతానికి ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.