ఏపీలో ఇంకొద్ది రోజుల్లో తన పతనం ఖాయమని నిర్ధారణ అయిపోవడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లుగా కనిపించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పర్యటనలో భాగంగా జగన్ ప్రసంగం అంతా ‘ఏడుపు’ చుట్టే సాగింది. ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేసినప్పుడు అప్పటి అధికార టీడీపీని బాదుడే బాదుడు అంటూ విమర్శించి.. ఇప్పుడు ఏడుపే ఏడుపు అనే కొత్త రాగం అందుకున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.83 కోట్లతో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను, రూ.700 కోట్లతో ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ సుజలధారను జగన్ ప్రారంభించారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడుతూ.. విశాఖలో తాను ప్యాలెస్ కట్టుకున్నా ప్రతిపక్షం ఏడుపే అంటూ మాట్లాడారు. విశాఖకు పరిపాలన రాజధాని తీసుకువస్తామన్నా ఏడుపే అని వ్యాఖ్యలు చేశారు. సీఎంగా తాను విశాఖపట్నంలో ఉంటానంటే కూడా ఏడుపే… ఆసరా పెన్షన్ పెంచినా ఏడుపే.. అంటూ తన ఏడుపును వెళ్లగక్కారు.
జగన్ చెప్పిన విషయాలన్నీ ఆయన సొంత డబ్బులతో చేస్తున్నవి కావు. విశాఖలో రుషికొండ ప్యాలెస్ కోసం ఖర్చు ఆయన సొంత డబ్బు కాదు. విశాఖకు రాజధాని మార్చడం.. అనే తుగ్లగ్ ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోయింది. దేశంలోనే ఒక రాజధాని లేని రాష్ట్రంగా ప్రజలు తలదించుకోవాల్సి వచ్చింది. పైగా మూడు రాజధానులు అని చెప్పిన ముఖ్యమంత్రి దాన్ని అటకెక్కించేశారు. ప్రజలకు మొత్తం నష్టం చేసి.. దాన్ని ప్రశ్నిస్తున్న విపక్షాలది ఏడుపు అనడం మతిలేని జగన్కే చెల్లింది.
పైగా ప్రతిపక్షాలు కేన్సర్ గడ్డతో సమానమని జగన్ పోల్చారు. నిజానికి ఐదేళ్ల క్రితమే రాష్ట్రానికి వైసీపీ అధికారంలోకి రావడం ద్వారా క్యాన్సర్ సోకింది. ఆ క్యాన్సర్ వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఆ క్యాన్సర్ గడ్డను తొలగించకపోతే.. మరింత ముదిరి రాష్ట్రం మరింత పేదరికంగా మారే ప్రమాదం ఉంది. తాను మంచి తలపెట్టే ప్రతి కార్యక్రమానికీ ప్రతిపక్షాలు ఏడుస్తున్నారంటూ విమర్శలు చేసిన ముఖ్యమంత్రి.. తాను చేసేదంతా మంచి అనుకోవడం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తోంది.
మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికలపై భయం అనేది ఏ స్థాయిలో ఉందో.. శ్రీకాకుళం సభలో మరోసారి తేటతెల్లం అయింది. అటు పవన్ కల్యాణ్ పైనా వ్యక్తిగత విమర్శలను కొనగించారు. తెలంగాణలో పోటీచేసిన పవన్ కల్యాణ్ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఆ రాష్ట్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థిని ప్రస్తావిస్తూ.. ‘ఛెల్లెమ్మ’ బర్కెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ప్రస్తావించారు. కానీ, వచ్చే ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్లు సైతం వైసీపీ అభ్యర్థులకు రావనే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గ్రహించే స్థితిలో కూడా లేకపోవడం విచిత్రం.