(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ ఉక్కు యువ కార్మికుల అధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవికి శనివారం క్షీరాభిషేకం చేశారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలిచి నందుకు ఉద్యోగులు చిరంజీవి చిత్ర పటానికి పాలభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే చిరంజీవిని కలిసి విశాఖ ఉక్కు పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరతామని యువ కార్మికులు తెలిపారు. బంటు రాము అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాస్కర్ రాజు, రామ్ ప్రసాద్, మోహన్ కుమార్, రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్కొక్కరుగా మద్దతు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సినీ పరిశ్రమ నుంచి ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే నటుడు శివాజీ శిబిరాన్ని సందర్శించి ఉద్యమం కడ వరకు తోడుగా ఉంటానని ప్రకటించారు. శుక్రవారం విశాఖలో సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన నటుడు మంచు విష్ణు అతని బృందాన్ని ఉద్యమకారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రతి ఒక్కరు తెలపాలని ఈ సందర్భంగా టాలీవుడ్ పెద్దలను వారు డిమాండ్ చేశారు. అందులో భాగంగా మంచు విష్ణు తన మద్దతు తెలిపారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఉద్యమానికి అండగా నిలవాలని ఉన్నప్పటికీ, కొన్ని రాజకీయ పరమైన ఇబ్బందుల కారణంగా దూరంగా ఉండాల్సి వస్తోందని విష్ణు తెలిపారు. ఇప్పుడు తాజాగా చిరంజీవి మద్దతు కూడా తెలపడంతో ఇక సినీ పరిశ్రమ నుంచి భారీ మద్దతు సమకూరుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భావిస్తోంది.
Must Read ;- ఆందోళనలకు దూరం.. విశాఖ ఉక్కు విషయంలో జనసేనాని అస్త్రసన్యాసమా..?











