(కృష్ణా జిల్లా నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీలో నేతల తీరు ఎవరి దారి వారిదే అన్నట్టు తయారైంది. టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచి ఆ తరవాత వైసీపీలోకి జంప్ చేసిన వల్లభనేని వంశీతో కలసి నడిచేందుకు ఎవరూ కలసి రావడం లేదు. ప్రధానంగా వల్లభనేని వంశీ చేతిలో 800 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలైన యార్లగడ్డ వెంకట్రావు, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన దుట్టా రామచంద్రరావు ఎవరి పావులు వారు కదుపుతున్నారు. అందరూ కలసి నడవాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వల్లభనేని వంశీతో కలసి పార్టీలో ముందుకు సాగేందుకు ప్రధాన నేతలు ముందుకు రావడం లేదు.
ఒక్క సారి వంశీ రాజీనామా చేసి వైసీపీ నుంచి గెలిస్తే, ఎమ్మెల్యే కావాలన్న తమ కల ఇక జీవితంలో నెరవేరదని యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు భావించడమే ఇందుకు ప్రధాన కారణం. ఒక వేళ వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళితే అతన్ని ఓడించేందుకు ఈ ఇద్దరు నేతలు సిద్దంగా ఉన్నారు. ఒక్క సారి ఓడిస్తే ఇక వారిద్దరూ మరలా వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని భావిస్తున్నారు.
వంశీ రాజీనామా… అంతా ఒట్టిదేనా?
గన్నవరం నుంచి టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ మరో నెల రోజుల్లో రాజీనామా చేస్తాడని, వైసీపీ నుంచి గెలిచి చూపిస్తాడని 6 నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే కరోనా ఎఫెక్టుతో ఇప్పుడు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అందుకే వంశీ రాజీనామా వాయిదా పడిందని మరో ప్రచారం మొదలు పెట్టారు. అసలు వంశీ రాజీనామా చేస్తాడా, ఒక వేళ రాజీనామా చేస్తే వైసీపీ నుంచి గెలుస్తాడా లేదా అని నియోజకవర్గ ప్రజలు బెట్టింగులు పెట్టుకునేంత కామెడీ వ్యవహారం అయిపోయింది.
అసలు గ్రౌండ్ లెవల్లో గన్నవరంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని ఆ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలోనే వెల్లడైందట. అందుకే వంశీని రాజీనామా చేయించే యోచనలో వైసీపీ అధిష్ఠానం లేదని ఒక వాదన వినిపిస్తోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఒంటికాలిపై లెగుస్తూ, చెప్పరాని భాషలో వంశీతో తిట్టించడంలో మాత్రం వైసీపీ నేతలు విజయం సాధించారు.
అయితే ఈ మధ్య కాలంలో ఇక రాజకీయాలకు సెలవ్ అంటూ వంశీ తన ఫేస్ బుక్ పేజీలో పెట్టి మరోసారి రాజకీయ దుమారం సృష్టించారు. నియోజకవర్గంలో తనను అందరూ అంటరాని వాడిలా చూస్తున్నారని, ఎవరూ కలసి రావడం లేదని వల్లభనేని వంశీ తన సన్నిహితుల వద్ద వాపోయారట. టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు ఆ పార్టీ పెద్దలు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడమే అసలు కారణం అని నియోజకవర్గ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా గన్నవరం వైసీపీ నేతలు సెల్ప్ గోల్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ఆ విషయం ప్రజలే నిర్ణయిస్తారనేది సత్యం.
గన్నవరంలో దుత్తా దుమారం
దుత్తా రామచంద్రరావు తాజాగా ఓ పార్టీ సమావేశంలో కూడా వంశీపై నిప్పులు చెరిగారు. ఈసారి ఎన్నికలు వస్తే తానే అభ్యర్థి అవుతానని, పదిహేనురోజుల్లో ప్రజలు చల్లటి వార్త వింటారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి వంశీ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శించారు. దీంతో గ్రూపు రాజకీయాలు మరోమారు భగ్గుమన్నాయి.











