వైఎస్ఆర్ సీపీ పుట్టినప్పటి నుంచి అబద్ధాల మీదే బతికింది. అసత్యాలనే పునాదులుగా చేసి దానిపైనే సానుభూతితో సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. దాన్ని గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. 2019కి ముందు జగన్ చెప్పిన అబద్ధాలను ప్రజలు బాగా నమ్మారు. తర్వాతి ఐదేళ్ల పాలన కాలంలో జగన్ రెడ్డి నిజ స్వరూపాన్ని ప్రజలు అనుభవించారు. దీంతో ఆయన ఫక్తు రాజకీయ నాయకుడని, రాజకీయం ముసుగులో సంపదను దోచేసుకుంటున్నాడనే వాస్తవాన్ని పసిగట్టారు.
ఇలా పదేళ్ల నుంచీ జగన్ అబద్ధాలను వింటూ వస్తున్న వైసీపీ నేతలు ఈ ధోరణి తమ పార్టీకి నష్టం కలిగిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఈ అబద్ధాలే తమను నిండా ముంచాయని అంటున్నారు. ఇకపై జగన్ నిజాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నోట్లో నుంచి ఒక విమర్శ వచ్చిందంటే అది 100 శాతం నిజమై ఉండాలని అంటున్నారు. ఈ అబద్ధాల వల్ల ప్రజలు తమ పార్టీని ద్వేషిస్తారని, ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడకే ప్రమాదమని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైగా జగన్ తో పాటు ఆయన మానస పత్రిక అయిన సాక్షి కూడా ఈ మధ్య అసత్యాలను పదే పదే ప్రచారం చేస్తోంది. భారతి రెడ్డి కనుసన్నల్లో కూటమి ప్రభుత్వం రోజుకొక అవాస్తవాన్ని, కొన్ని సార్లు పదే పదే ఒకే అబద్ధాన్ని వండి వార్చుతున్నారు. ఇలా మళ్లీ అబద్ధాల పునాదులపైనే రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య కేసుపై నాటకం, తిరుమలలో పింక్ డైమండ్ పోయిందంటూ చేసిన కట్టుకథలు.. ఇలా ఎన్నో జగన్ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. పైగా 35 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని అడ్డగోలు ఆరోపణలు చేశారు. చంద్రబాబు రూ.6 లక్షల కోట్ల అవినీతి చేశారంటూ ఏకంగా ఒక పుస్తకం రాశారు.
ఇలా జనం నమ్మేవరకు ఒకే అబద్ధాన్ని వందచోట్ల, వందసార్లు, వంద మంది చేత వంద రకాలుగా చెప్పించడంతో అప్పట్లో జగన్ బాగా లబ్ధి పొందారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ అదే ఫార్ములాను నమ్ముకుంటున్నారు. తన మీడియాలో అదే పనిగా కూటమి ప్రభుత్వం గురించి అర్థం లేని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కానీ, ఇదంతా చూస్తూ వస్తున్న వైసీపీ శ్రేణులకు విరక్తి పుడుతోంది. కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు ఆపాలని, ముందు అధినేత నిజాయితీగా ఉండాలని హితవు పలుకుతున్నాయి. ఎప్పుడూ ఒకే ఫార్ములా వర్కౌట్ కాదని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.











