కాళోజీ నారాయణ రావు. తెలంగాణ మహాకవి. మహా మనీషి. ఆయన పేరిట ప్రతి ఏటా ఇచ్చే కాళోజీ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, కథకుడు, నవలా రచయిత రామాచంద్రమౌళికి ఇవ్వనున్నారు. కాళోజీ అవార్డు ఎంపిక కమిటీ చేసిన ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 9 వ తేదీన కాళోజీ నారాయణ రావు జయంతి. ఈ రోజున ఆయన పేరిట ఇస్తున్న అవార్డును రామాచంద్రమౌళికి ప్రదానం చేస్తారు. వరంగల్ గణపతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేసి పదవీ విరమణ పొందిన రామాచంద్రమౌళి వరంగల్ లోనే నివాసముంటున్నారు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. కవిగా, రచయితగా ఎన్నో మంచి రచనలు చేసిన రామాచంద్రమౌళిని గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ నంది పురస్కారంతో గౌరవించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, సినారె, ఆవంత్స సోమసుందర్, గుంటూరు శేషేంద్ర శర్మ, కొలకనూరి పేరిట ఇచ్చిన అవార్డు కూడా రామాచంద్రమౌళిని వరించాయి. సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసారు రామాచంద్రమౌళి. ఇప్పటి వరకూ దాదాపు 52 పుస్తకాలు వెలువరించిన రామాచంద్రమౌళి. ఇందులో 340 కథలు, 31 నవలలు, 11 కవితా సంపుటాలు ఉన్నాయి. తెలుగులో ఇంత విస్తృతంగా రచనలు చేసిన వారు చాలా అరుదు. నాటక రంగం పట్ల కూడా ఎంతో మక్కువ ఉన్న రామాచంద్రమౌళి కొన్ని నాటకాలను కూడా రచించారు. వందలాది పుస్తకాలకు సమీక్షలు రాసిన రామాచంద్రమౌళిది రచనా శైలి విశిష్టంగా ఉంటుంది. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే మరోవైపు ఆయన ఇంజనీరింగ్ విద్యార్ధుల కోసం ఆరు ప్రామాణిక పుస్తకాలను కూడా తీసుకువచ్చారు. రామా చంద్రమౌళి రచనలు మరాఠీ, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీషు, బెంగాలీ బాషల్లోకి అనువదించబడ్డాయి. తమిళంలో రామాచంద్రమౌళి రచనలంటే ప్రాణం పెట్టే వారు ఉన్నారంటారు. 2010, 2012, 2015 సంవత్సరాల్లో జరిగిన సార్క్ సాహిత్య సమావేశాల్లో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు రామాచంద్రమౌళి. ఇది తెలుగు వారికి దక్కిన గౌరవం. రామాచంద్రమౌళి రచనలు తెలంగాణ ఉద్యమంపై రాసిన కాలనాళిక విశేషమైన ఆదరణ పొందింది.
పలువురు సాహితీవేత్తలు హర్షం
రామాచంద్రమౌళికి పద్మభూషణ్ కాళోజీ అవార్డు రావడం పట్ల పలువురు సాహితీ వేత్తలు లియో న్యూస్ తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. “ రామాచంద్రమౌళి సార్ గొప్ప రచయిత, కవి, భావుకుడు.అంతకు మించి మంచి మనీషి. కాళోజీ అవార్డుకు ఇంతకు ముందే ఆయనకు రావాలి. ఆయనకు అవార్డు రావడం చాలా ఆనందంగాను, సంతోషంగాను ఉంది “ అని గతంలో కాళోజీ అవార్డు పురస్కార గ్రహీత కవి సీతారాం అన్నారు.
రామాచంద్రమౌళి రచనలు జీవితంలోంచి వచ్చినట్లుగా ఉంటాయని, ఆయన కవిత్వం చదివితే మనిషికి గుండె నిబ్బరం వస్తుందని ప్రముఖ కవి శిఖామణి అభిప్రాయపడ్డారు. “తెలుగు రాష్ట్రాల ప్రజలు రామాచంద్రమౌళి మా కవి అని గర్వంగా చెప్పుకునే కవి. ఆయన కవిత్వమే కాదు ఏ రచన అయినా అద్భుతం. కాళోజీ పురస్కారానికి నూటికి రెండు వందల శాతం రామా చంద్రమౌళి అర్హులు “ అని ఆయన అన్నారు.