చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన మాజీ జడ్జి రామకృష్ణ కుటుంబ సభ్యులపై గత కొంత కాలంగా జరుగుతున్న దాడులకు నిరసనగా పిలుపిచ్చిన చలో మదనపల్లి జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ దళిత సంఘాలు, మైనార్టీ నాయకులు ధర్నాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు ధర్నాల్లో పాల్గొంటున్న వారిని అరెస్టు చేస్తున్నారు. హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్, మాజీ జడ్జి రామకృష్ణ పోలీసుల వైఖరిని నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగారు.
దీక్ష విరమణ
దీక్ష విరమణ
చలో మదనపల్లె కార్యక్రమం సందర్భంగా పోలీసుల తీరును నిరసిస్తూ తిరుపతిలో ఒక హోటల్లో చేపట్టిన నిరాహారదీక్షను హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్, మాజీ జడ్జి రామకృష్ణ తదితరులు శుక్రవారం మధ్యాహ్నం విరమించారు. మదనపల్లెకు వెళ్లనీయకుండా హోటల్ వద్ద పోలీసులు నిర్బంధించారు.
జిల్లాలో లో పలు చోట్ల నేతలు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు నిరసనగా శ్రవణ్ కుమార్, రామకృష్ణ తదితరులు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. అనంతరం పోలీసు అధికారులు న్యాయవాది శ్రావణ్ కుమార్ తో చర్చించారు. తమతో పాటు అందరిని బేషరతుగా వదిలిపెడితే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు.
దీంతో అదుపులోకి తీసుకున్న దళిత నేతలు, కార్యకర్తలు అందరిని పోలీసులు విడిచి పెట్టారు. పోలీసు నిర్బంధం నుంచి విడుదలైన శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తమ కార్యక్రమం విజయవంతం అయింది అన్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కు తమ నేతలు వినతి పత్రం ఇచ్చారని చెప్పారు. బి.కొత్తకోట కు వెళ్లి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత విజయవాడ వెళ్లనున్నట్లు ప్రకటించారు.
దళిత సంఘాల ఆగ్రహజ్వాలలు
గత కొంత కాలంగా మాజీ జడ్జి రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యుల పై జరుగుతున్న దాడులతో దళిత సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఆదివారం బీ.కొత్తకోట లో జరిగిన స్వల్ప వివాదం రామ కృష్ణ సోదరుడు రామచంద్ర పై దాడికి దారి తీసింది. ఈ కేసులో నిందితులు అందరిని అరెస్టు చేయకపోవడంతో పాటు రామకృష్ణకు జరుగుతున్న అన్యాయంపై హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ శుక్రవారం చలో మదనపల్లె కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించారు. అయితే గురువారం సాయంత్రం నుంచే పోలీసులు కీలకమైన దళిత సంఘాల నేతలను అరెస్టు చేయడం ప్రారంభించారు. మదనపల్లెలో పోలీస్ యాక్ట్ 30 తో పాటు 144 సెక్షన్ విధించారు. మరికొందరు నేతలు గృహ నిర్బంధానికి గురయ్యారు.
చలో మదనపల్లె ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు న్యాయవాది శ్రావణ్ కుమార్ తిరుపతి వచ్చారు. ఆయన బసచేసిన హోటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హోటల్ నుంచి ఆయనను బయటకు రానివ్వలేదు. ఆయనతోపాటు మాజీ జడ్జి రామకృష్ణ, కొందరు నేతలు హోటల్ లో ఉన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా హోటల్ లోనే నిరాహార దీక్షకు కూర్చున్నారు. హోటల్ వద్దకు చేరుకున్న దళిత సంఘాల కార్యకర్తలు, మైనార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
దీంతో ఆగ్రహం చెందిన న్యాయవాది శ్రావణ్ కుమార్ చలో తిరుచానూరుకు పిలుపునిచ్చారు. అందుబాటులోని కార్యకర్తలు తిరుచానూరు చేరుకుని పోలీసుల అదుపులో ఉన్న కార్యకర్తలకు నేతలకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా మదనపల్లెలో శుక్రవారం ఉదయం నుంచి ఎక్కడికక్కడ దళిత సంఘాల కార్యకర్తలు పోలీసులు అరెస్టు చేస్తున్నారు. చలో మదనపల్లె కార్యక్రమం కారణంగా తిరుపతి, మదనపల్లె పట్టణాల్లో ఉద్రిక్తత నెలకొంది.










