ప్రభుత్వ అధీనంలోకి మాంసం విక్రయాలు.. మాంసం విక్రయాలను ప్రభుత్వమే చేపడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మటన్ మార్టులను ప్రవేశపెడతామంటూ ఇటీవల ఏపీలోని జగన్ సర్కారు నుంచి జారీ అయిన ఒక్క మాట ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విమర్శల దెబ్బకు జగన్ వెనకడుగు వేయక తప్పలేదు. అది ప్రతిపాదన మాత్రమే దానిపై ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. అయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండానే ఇలా విమర్శలు చేస్తే ఎలాగంటూ ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఓ రేంజిలో బాధపడిపోయారు. మొత్తంగా ఈ వ్యవహారంపై జగన్ సర్కారుపై సోషల్ మీడియాలో ఓ రేంజి ట్రోలింగ్ జరిగితే.. జగన్ ఇమేజీ భారీగానే డ్యామేజీ అయ్యింది. అయితే ఇదే విషయంలో మాట మాత్రంగా కూడా బయటకు చెప్పకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా నిర్ణయమే తీసేసుకున్నారట. అయితే జగన్ మటన్ మార్టుల్లా కాకుండా.. ప్రస్తుతం నడుస్తున్న మటన్ షాపులకు ప్రభుత్వమే మటన్ సరఫరా చేస్తుందట. దానినే వ్యాపారులు అమ్మాలట.
మాసం దుకాణాలన్ని సర్కారీ పరిధిలోకి…
ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో ఉన్న మాంసం దుకాణాలన్నింటీని తన పరిధిలోకి తీసుకోబోతోంది. ప్రజలకు పరిశుభ్రమైన మాంసాన్ని అందించడం, మాంసం ధరలను నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలి నుంచి కూడా మాంసం విక్రయాలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉంటున్నాయి. దీంతో పలు చోట్ల నాసిరకం మాంసాన్ని వ్యాపారులు అమ్ముతున్నారు. చనిపోయిన జంతువులను కోసి కూడా విక్రయిస్తున్నారు. దీనికి తోడు ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముతూ పేదవారు మటన్ తినలేని పరిస్థితిని తీసుకొచ్చారు. వీటన్నింటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పశుసంవర్ధక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కబేళాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి జోన్ లో రెండు కబేళాలు, ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు కబేళాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ కబేళాలకు స్థానిక మాంసం దుకాణాలను అనుసంధానం చేస్తారు. ఇకపై ప్రభుత్వం సరఫరా చేసే మాంసాన్నే షాపుల్లో అమ్మాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాల్సి ఉంటుంది.
మంచి చేయాలంటే ప్రచారమెందుకు?
వాస్తవానికి మాంసం విక్రయాల్లో అందరూ కాకున్నా మెజారిటీ వ్యాపారులు ఇష్టారాజ్యంగానే వ్యవహరిస్తున్నారు. ఎవరికి నచ్చిన రేట్లకు వారు మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఏ జంతువు మాంసం అమ్ముతున్నారో కూడా జనాలకు తెలియడం లేదు. తూకాల్లోనూ మోసం చేస్తున్న వారు లేకపోలేదు. ఈ తరహా అక్రమాలకు చెక్ పెట్టాలంటే.. కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయం అమలు కావాల్సిందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వమే కబేళాలు నిర్మించి నిర్వహిస్తే.. మరింత మెరుగైన వాతావరణం కూడా నెలకొనే అవకాశాలున్నాయి. ఇవేవీ పట్టకుండా.. మటన్ మార్టులను పెట్టేస్తాం.. వాటి ద్వారా మటన్ ను విక్రయిస్తామంటే జనం ఎందుకు ఒప్పుకుంటారు? అయినా మంచి చేయాలనుకున్నప్పుడు చేసేసుకుంటూ పోవడమే తప్పించి.. ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామంటూ లీకులు ఇచ్చేసి జనం ఆగ్రహంతో వెనక్కు తగ్గడం ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నదదే. జగన్ కు ఈ విషయం ఎప్పటికి అర్థమయ్యేనో?.
Must Read ;- డబుల్ షాక్ దిశగా కేసీఆర్ .. వ్యూహమేంటో?











