తెలంగాణ ప్రజలకు త్వరలోనే డబుల్ షాక్ తప్పదా? అన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓ వైపు ఆర్టీసీ చార్జీలు, మరోవైపు విద్యుత్ చార్జీలను పెంచే దిశగా ఆయా విభాగాాల అధికారులు
కేసీఆర్ ముందు ఈ మేరకు ప్రతిపాదనలు పెట్టారు. ఈ ప్రతిపాదనలపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. ఆర్టీసీని నష్టాల బాట నుంచి గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టామని, అయితే ఆలోగానే కరోనా విలయం విరుచుకుపడిందని ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్.. సంస్థను రక్షించే దిశగా కఠినమైనవైనా దిద్దుబాట చర్యలు చేపట్టాల్సిందే కదా అని వ్యాఖ్యానించారట. అదే సమయంలో
విద్యుత్ సరఫరా, చార్జీలపై కేసీఆర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ నోట నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో ఇటు ఆర్టీసీతో పాటు, అటు విద్యుత్ చార్జీలు పెంపు తప్పకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నిరసనలకు తట్టుకోగలరా?
సరే.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను గట్టెక్కించేందుకు చార్జీలను పెంచడం ఇప్పుడే కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా సార్లు, చాలా మంది సీఎంలు అనుసరించిన వ్యూహం కూడా ఇదే. అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైరి వర్గాలుగా ఉన్న
కాంగ్రెస్ పార్టీతో పాటు
బీజేపీ కూడా ఇప్పుడు ఫుల్ దూకుడు మీద ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు దొరుకుతుందా? ఎప్పుడు విరుచుకుపడదామా? అన్నట్లుగా ఆ రెండు పార్టీలు కాసుక్కూర్చున్నాయనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో ఒకే సారి రెండు రకాల చార్జీలు పెంచితే ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం లేకపోలేదు. మొత్తంగా అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల నుంచి ఒకేసారి నిరసనలు వ్యక్తమయితే
కేసీఆర్ సర్కారు తట్టుకుంటుందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
కేసీఆర్ వ్యూహమిదేనా?
త్వరలోనే కరీంనగర్ జిల్లా
హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగబోతోంది. కేసీఆర్ నుంచి దాదాపుగా బర్తరఫ్ నకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచి తీరాలి. లేదంటే.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారిపోతుంది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసం మంత్రాంగం రచించిన కేసీఆర్..
దళిత బంధు పేరిట సంచలన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాల మాదిరే ఇతర వర్గాలకు కూడా సాయం అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే హుజూరాబాద్ ఎన్నికలంటే భయపడుతున్న కారణంగానే కేసీఆర్ సర్కారు ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు మరో రెండు, మూడు నెలల తర్వాత జరిగేలా ప్లాన్ రచించిన కేసీఆర్.. దళిత బంధు విమర్శల నుంచి తప్పించుకునేందుకే చార్జీల పెంపునకు సిద్ధమయ్యారా? అన్న దిశగా సరికొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చార్జీలు పెరిగినా.. విపక్షాలు ఆందోళనలు చేసినా.. ఎన్నికల నాటికి అవి తగ్గిపోతాయన్న కోణంలోనే కేసీఆర్ చార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.