హుజూర్ నగర్ ఉప ఎన్నిక, దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవాలనుంచి కూడా పాఠాలు నేర్వలేదు. కుమ్ములాటలు మానలేదు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు.. అయినా పార్టీలో చురుకుదనం లేదు. పైగా తమే మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతారు.. ఇదంతా ఏపార్టీ గురించి జరుగుతున్న చర్చో.. ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని చెబుతూ.. అంతర్యుద్ధాలతో పాతాళంలోకి వెళ్తోన్న కాంగ్రెస్ పార్టీ గురించే ఇదంతా. కేడర్ బాగానే ఉన్నా..లీడర్ షిప్ సరిగ్గా లేకపోవడంతో నావికుడు లేని నావలా మారింది ఆ పార్టీ పరిస్థితి.
కాంగ్రెస్ తప్ప.. అంతా రెఢీ..
త్వరలో తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలకు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చనే అంచనా పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ సిద్ధం అయ్యాయి. ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్సీ బరిలో.. టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి దాదాపు ఖరారైనట్టే. ఇప్పటికే ఆయన సమావేశాలు నిర్వహిస్తూ విజయానికి సహకరించాలని కోరుతున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉండనున్నారు. సీనియర్ జర్నలిస్టు జయసారథి రెడ్డి కి వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. టీజేఎస్ నుంచి కోదండరాం, యువ తెలంగాణ పార్టీనుంచి రాణి రుద్రమ, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి మానవతారాయ్ పేరు వినిపిస్తున్నా ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
ఇక హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్లో ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్రావు మరోసారి పోటీలో ఉంటుండగా, టీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ లీడర్ బొంతు రామ్మోహన్ (ప్రస్తుత మేయర్) పేరు ఖరారైంది. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ రంగంలో ఉన్నారు.తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు చెరకు సుధాకర్ రెడ్డి, ఆర్ఎల్ డీ నుంచి దిలీప్ కుమార్ బరిలో ఉన్నారు. మొత్తంమీద కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు అభ్యర్థులను అధికారికంగానో, అనధికారికంగానో ఖరారుచేశాయి. ఓటర్ల నమోదునుంచి కార్యాచరణ మొదలుపెట్టాయి. ప్రచారం ప్రారంభించాయి. కాంగ్రెస్ మాత్రం పోటీ చేస్తుందా.. ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనే సందేహాలను కలిగిస్తోంది. ఇప్పటికీ ముఖ్యనేతల ఆలోచనలు మేథోమథనం చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వారంతా కలసి మూడు నాలుగు పేర్లతో ఆశావహుల జాబితాను తయారు చేశాక.. హైకమాండ్ ఆమోదం మేరకు పేరు ను ఖరారు చేస్తారు. అయితే.. అంతా కలసి తీరిగ్గా నిర్ణయం తీసుకునేలోపు.. వివాదాలను సర్దుబాటు చేసే లోపు.. పుణ్య కాలం కాస్తా గడిచిపోతుందని, ప్రచారంలో వెనుకబడిపోతామనే ఆందోళన కేడర్ లో మొదలైంది.
సాధారణ ఎన్నికలతో పోల్చితే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం భిన్నంగా ఉంటేనే గెలుపు సాధ్యం. ఓటర్లలో చైతన్యం రేకెత్తించడం, ప్రభుత్వ వైపల్యాలు- ముఖ్యంగా ఉపాధి అవకాశాల విషయంలో, ఉద్యోగాల భర్తీ విషయాల్లో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం చేయడం కీలకం. డబ్బుతోనో.. పలుకుబడితోనో.. నెట్టుకొద్దామంటే కుదరని పరిస్థితి స్పష్టంగా ఉన్న నేపథ్యంలో చెమటోడ్చి.. ఓటర్లను ఆకట్టుకుంటేనే గెలుపు సాధ్యం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీలు ముందంజలో ఉంటే.. కాంగ్రెస్ పార్టీ ఆమడదూరంలో ఉంది. ఇలాగే కొనసాగితే.. ఇప్పటికే ఉన్న కేడర్ మరింత దూరం అవుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.