నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణ పనులు జోరందుకున్నాయి. మూడు షిఫ్టుల్లో కార్మికులు పని చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి పరిధిలో దాదాపు 10 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సంఖ్య రెట్టింపవుతుందన్నారు మంత్రి నారాయణ. ప్రభుత్వ భవనాలకు సంబంధించి గతంలో నిలిచిపోయిన పనులను ..మళ్లీ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత కాంట్రాక్టర్ సంస్థలు పనులను వేగవంతం చేశాయి.
ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు కంపెనీలు కూడా తమకు కేటాయించిన స్థలాల్లో పనులను స్పీడప్ చేశాయి. స్థలాలు పొందిన ప్రతి ఒక్కరికీ ..నిర్మాణాలు ప్రారంభించడానికి ఆరు నెలల సమయం ఇచ్చారు. ఈ లోపు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించకపోతే స్థలాలు రద్దు చేస్తామని ప్రకటించారు. గెయిల్ ఇండియా, అంబికా దర్బార్ బత్తి కంపెనీలు..ఆసక్తి చూపకపోవడంతో వాటికి స్థలాలను రద్దు చేశారు. చాలా కంపెనీలు ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చాయి. ప్రారంభించకపోతే ఆ కేటాయింపులను రద్దు చేయనున్నారు.
రెండు,మూడేళ్లలో అమరావతికి దృశ్యరూపం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అదే సమయంలో అమరావతి విస్తరణ ప్రణాళికల్ని కూడా అమలు చేస్తున్నారు. ఎయిర్ పోర్టుతో పాటు వివిధ సంస్థలకు అవసరమైన భూమిని..భూమీకరణలో సేకరించేందుకు నిర్ణయించారు. చాలా మందిరైతులు తమ ఆమోదం తెలిచేస్తున్నారు. ఇదే వేగంతో పనులు జరిగితే మళ్లీ ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం మరింత బలపడే అవకాశం ఉంది.











