రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు..!
ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లు జగన్ రెడ్డి ప్రభుత్వంలో పరిష్కరం కావని, ఉద్యోగ సంఘాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. సోమవారం అర్థరాత్రి పీఆర్సీ అమలు చేస్తున్నట్లు విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. హెచ్ఆర్ఏ లో భారీ కోతలు విధిస్తూ.. కోరిన ఫిట్మెంట్ కన్నా తక్కువ ప్రకటించడంపై ఉద్యోగ జేఏసీ లు భగ్గుమంటున్నాయి. ఇక నిర్వీరామ ఉద్యమానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసి జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు.
ఉద్యోగ సంఘాలను సంప్రదించకుండా జీవోలను ఎలా విడుదల చేస్తారు?
ఉద్యోగ సమస్యలను తక్షణ పరిష్కరించాలని 71 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జేఏసీ నేతలు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫిట్మెంట్ తమకు ఏ మాత్రం అంగీకారంగా లేదని, హెచ్ఆర్ఏలో కోతలు విధిస్తే.. సహించేది లేదని జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సంక్రాంతి తరువాత సానుకూల నిర్ణయం వెలువడుతోందని చెప్పి, ప్రభుత్వం మోసం చేసిందని వాపోయ్యారు. ఫిట్మెంట్ ను పెంచి, హెచ్ఆర్ఏలో కోతలు, సీపీఎస్ రద్దు, విశ్రాంతి ఉద్యోగుల జీతాలు కుదింపు వంటి వాటిపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని కోరారు. అలానే ప్రభుత్వం దిగొచ్చి న్యాయ ప్రకారం కోరిన తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని, మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. మరోవైపు మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, ప్రభుత్వ జీవోలను దహనం చేయాలని ఫ్యాప్టో పిలుపునిచ్చింది!