సంగం డెయిరీ యాజమాన్యం,నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది. డెయిరీ యాజమాన్య హక్కులను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డెయిరీ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర అవినీతికి పాల్పడ్డారంటూ ఏసీబీ కేసులు పెట్టి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఇక నుంచి డెయిరీ నిర్వహణ బాధ్యతలను తెనాలి సబ్ కలెక్టర్కు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ వడ్లమూడి లోని సంగం డెయిరీకి చేరుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దూళిపాళ్ల నరేంద్ర తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
సహకార రంగంలో కొనసాగుతుందా?
ప్రభుత్వం సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇక నుంచి డెయిరీ బాధ్యతలు ప్రభుత్వం చూస్తుందని జీవోలో స్పష్టం చేశారు. అయితే గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి డెయిరీ యాజమాన్య హక్కులు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే డెయిరీ మరల సహకార రంగంలోకి వచ్చినట్టు భావించాల్సి ఉంటుంది. 13 సంవత్సరాల కింద సహకార రంగంలోని సంగం డెయిరీని మ్యాక్స్ సొసైటీ నుంచి ప్రైవేటుకు మార్చారు. అప్పటి నుంచి హైకోర్టులో కేసు నడుస్తోంది.
నరేంద్ర అరెస్టు అందుకేనా?
టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ ఛైర్మన్ దూళిపాళ నరేంద్ర తీవ్ర అవినీతికి పాల్పడ్డారంటూ 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఏసీబీ కోర్టులో హాజరు పరిచి 14 రోజులు రాజమండ్రి జైలుకు రిమాండ్కు పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ చర్యలతో సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేందుకే ఆ సంస్థ ఛైర్మన్ దూళిపాళ నరేంద్రను అరెస్టు చేశారనే వాదనకు బలం చేకూరుతోంది.
Must Read ;- రెండు రకాలుగా దెబ్బకొట్టాలనేనా.. టార్గెట్ టీడీపీ,సంగం డెయిరీ











