అమరావతి వేశ్యల రాజధాని అంటూ కించపరిచిన కేసులో సాక్షి ఛానల్కు చెందిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని కొమ్మినేని ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అమరావతి మహిళలను కించపరిచారంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఇటీవల ఆయనపై కేసు నమోదైంది. రాజధాని మహిళలు, రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..ఆయనను అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
సాక్షి టీవీలో కొమ్మినేని కార్యక్రమంలో అమరావతి వేశ్యల రాజధాని అంటూ సీనియర్ జర్నలిస్టు విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్లో వివాదం మొదలైంది. ఈ వ్యాఖ్యలపై అమరావతి ప్రజలు భగ్గుమన్నారు. ఎక్కడికక్కడ సాక్షి ఛానల్తో పాటు కొమ్మినేని, కృష్ణంరాజులపై ఫిర్యాదులు చేస్తూ ఆందోళనలకు దిగారు. ఇక ఈ వ్యాఖ్యలను బీజేపీతో, జనసేన, కమ్యూనిస్టు అనుబంధ సంఘాలు కూడా ఖండించాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు డీజీపీకి లేఖ సైతం రాశారు. ఇక ఎంపీ లావు కృష్ణదేవరాయలు సైతం NCWకు లేఖ రాశారు. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాక్షిపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు.
ఇక ఈ అంశంపై సీఎం చంద్రబాబు సైతం కఠినంగా ఉన్నారు. ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరమ హిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కొమ్మినేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే!
జూన్ 6న సాక్షి టీవీలో నిర్వహించిన చర్చావేదికలో భాగంగా, అమరావతి దేవతల రాజధాని అనే ప్రభుత్వ ప్రచారాన్ని విమర్శించారు కృష్ణంరాజు.ఆ చర్చావేదికను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు నిర్వహిస్తున్నారు. అమరావతి దేవతల రాజధాని అని పదేపదే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ గారు చెబుతున్నారన్న కృష్ణంరాజు..అలా చెప్పడం హిందూ దేవతలను ఆరాధించే వారిని కించపరిచడమేనన్నారు. దేవతల రాజధాని అమరావతి ఎక్కడో పైన ఉంటుంది ఏదో ఇంద్రలోకమో ఇంకోటో. దాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన అమరావతిని దేవతల రాజధాని అని ఎట్లా అంటారండి అంటూ కృష్ణంరాజు విమర్శించారు. ఐతే వ్యాఖ్యలను అక్కడే కొమ్మినేని తీవ్రంగా ఖండించాలి కానీ ఆయన అలా చేయలేదు సున్నితంగా అలా అనకూడదు అంటూ చిన్న నవ్వు నవ్వారు. తర్వాత కృష్ణంరాజు వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగా అవును నేను ఆ వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో, ది హిందూలోనో చూశాను అంటూ కొమ్మినేని కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.











