Atchannaidu Warns To AP CM Jagan :
బలమైన టీడీపీ పార్టీని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనుకుంటుందా..? ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందా..? శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం వైసీపీ చేతిలో బంది అయ్యిందా.. అంటే అవుననే చెప్పక తప్పదు. ఏపీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సంక్షేమ పాలనను పక్కనపెట్టి.. అక్రమ కేసులు, అరెస్టులతో రాక్షస ఆనందం అనుభవిస్తోంది. ప్రశ్నిస్తే కేసులు పెడుతోంది. ఎదురు తిరిగితే.. ప్రతి దాడులకు దిగుతోంది. మానసికంగా దెబ్బ కొడుతూ టీడీపీ ప్రభావం కోల్పోయేలా చేస్తోంది. చివరకు టీడీపీ సానుభూతి పరులను వదలడం లేదు. కరెంట్ కట్ చేస్తూ.. ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తూ చిత్రహింసలకు గురిచేస్తోంది. కర్నూల్ జిల్లాలో టీడీపీ నాయకుల హత్య మరువకుముందే.. నూజివీడులో టీడీపీ కార్యకర్తల అయిన మంచోడు జీబీ మణి, కుంకునోళ్ళ నాగబాబుపై వైసీపీ నాయకులు దాడి చేశారు.
దాడుల దాహాన్ని తిప్పికొడతాం
కార్యకర్తల దాడిపై టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులు ముష్కరుల, రౌడీల్లా మాదిరిగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలకు పట్టిన దాడుల దాహాన్ని త్వరలోనే తీరుస్తామని, టీడీపీ వారితో ఎందుకు పెట్టుకున్నామా? అని భయపడే రోజులు త్వరలో వస్తాయని హెచ్చరించారు. దాడిచేసిన వారిపై కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. పోలీసులు వేసుకుంది నీలి చొక్కాలు కాదని.. ఖాకీ చొక్కాలన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. శాంతిభద్రతల పట్ల పోలీసులకు నమ్మకం ఉంటే వెంటనే కేసులు నమోదు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.