ఆంధ్ర ప్రదేశ్ లో మహిళల పై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన మరువకముందే.. రాజధాని ప్రాంతంలో మరో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తుమ్మపూడిలో చోటుచేసుకుంది. తుమ్మపూడికి చెందిన తిరుపతమ్మ పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త తిరుపతిలో పనిచేస్తూ అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న తిరుపతమ్మ పై నలుగురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడి హతమార్చినట్టు తెలుస్తోంది. తిరుపతమ్మ భర్త సమీప బంధువువే మద్యం సేవించి తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి గా పాల్పడినట్లు స్థానికుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్లు మృతురాలి భర్త పేర్కొన్నారు.
ఇక ఘటనలో నిందితులను తప్పించేలా పోలీసుల వ్యవహారం ఉందని మృతురాలి భర్త ఆరోపిస్తున్నారు. జరిగిన సంఘటన పై మృతురాలి తల్లిదండ్రులు, కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే ఫిర్యాదులో అనుమానితుల పేర్లు రాయవద్దని పోలీసులు చెప్పడం పై తిరుపతమ్మ భర్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని, పోలీసుల తీరు నిందితులను తప్పించే విధంగా ఉన్నాయని చెబుతున్నారు. నలుగురు అనుమానితులు పేర్లు చెప్పినా, కేవలం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, మిగితా వారిని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఘటన పై స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇక ఘటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ స్పందించారు. హోం మంత్రికిగానీ, ప్రభుత్వానికిగానీ ఇలాంటి ఘటనలపై సీరియస్ నెస్ లేదని, అందుకే ఈ ఘటనలు పెరిగిపోతున్నాయని అన్నారు. సుచరిత అనంతరం హోం మంత్రిగా వనిత బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో ఘటనలు బాగా పెరిగాయని, 20 నుంచి 30 ఘటనల వరకు జరిగాయని అన్నారు.
తెలంగాణలో ఇలాంటి ఘటనలే జరిగితే.. నిందితులను కాల్చి చంపారని, కానీ, ఏపీలో మాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను సజ్జల రామకృష్ణారెడ్డి తన చేతుల్లో పెట్టుకున్నారని, మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని ఆరోపించారు. ‘సకల శాఖలను సజ్జలనే చూసుకోవాలి.. జగన్ పబ్జీ ఆడుకోవాలి.. జనాల మానప్రాణాలు గాల్లో కలిసిపోవాలి’ అంటూ ఎద్దేవా చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణ తన వల్ల కావడం లేదంటూ హోం మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. హోం మంత్రి మారినా.. మహిళల మాన ప్రాణాలను కాపాడడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందన్నారు. హోం మంత్రి సంఘటన స్థలానికి వెళ్లాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జవహర్ డిమాండ్ చేశారు.