హాంకాంగ్, తైవాన్, భూటాన్ వంటి దేశాలతో పాటు చైనా ఆధిపత్య పోరు అనేక దేశాలకు కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు జట్టు కడుతున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడైనట్లు.. చైనా బాధిత దేశాలకు అమెరికా దన్నుగా నిలుస్తుండటం గమనార్హం.
తన ఆధిపత్యానికి అడ్డుపడేలా మారుతున్న చైనాకు చెక్ పెట్టాలని అగ్రరాజ్యం అమెరికా తీర్మానించింది. డ్రాగన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం ఒక కమిటీని నియమించింది. ది చైనా టాస్క్`ఫోర్స్ పేరిట రూపొందిన ఈ కమిటీ ప్రభుత్వానికి అనేక సూచనలు చేసింది. భారత్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో బహుపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవాలని పేర్కొంది. అలాగే భారత్ సహా 10 దేశాలు సభ్యులుగా గల డి-10 కూటమికి ఈ కమిటీ మద్దతు తెలిపింది.
మొత్తానికి చైనా వ్యతిరేక కూటమి బలపడటానికి అమెరికా చేస్తున్న కృషి భారతదేశానికి అనేక విధాలా లాభిస్తుందనడంలో సందేహం లేదు. అగ్రరాజ్యం అమెరికాతో సత్సంబంధాలు మెరుగు పడనున్నాయి. పెద్దన్నతో స్నేహం ఎప్పటికైనా లాభదాయకమే. అలాగే భావసారూప్యత గల దేశాలతో కొత్త కూటమి మన పరపతికి దోహదపడేవే. ఆ విధంగా భారత్ పట్ల అమెరికా స్నేహానికి కారణమైన చైనాకు మనం తప్పకుండా థాంక్స్ చెప్పుకోవాల్సిందే.