బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు మంచి నిర్ణయమే. ఉద్యోగుల్లో జవాబుదారీ తనాన్ని పెంచే అంశాల్లో కీలకమైనదేనని చెప్పాలి. అయితే ఆ బయోమెట్రిక అటెండెన్స్ కోసం సరిపడ ఏర్పాట్లు కూడా చేయాలి కదా. నగరాలు, పట్టణాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ ఆఫీసుల్లో ఈ తరహా అటెండెన్స్ కు ఎలాంటి ఇబ్బందీ రాదనే చెప్పాలి. అయితే పల్లె సీమలు.. ప్రత్యేకించి అటవీ ప్రాంతాల్లో ఉండే గ్రామాలు.. రోడ్డు సౌకర్యానికే నోచుకోని గ్రామాలు.. ఇలాంటి ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్సే ఉండవు. ఇక్కడి ప్రభుత్వకార్యాలయాల్లో గానీ, ప్రభుత్వ స్కూళ్లలో గానీ పనిచేసే సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం ఎంతగా శ్రమిస్తున్నారో చెప్పేదే పై ఫొటో. ఇలాంటి నేపథ్యంలో జగన్ సర్కారు మంగళవారం నాడు బయోమెట్రిక్ అటెండెన్స్ ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సీఎస్ ఉత్తర్వుల జారీ..
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును మళ్లీ అమలు చేయబోతున్నట్టు జగన్ సర్కారు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు సహా జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల్లో కూడా బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని ఆయన చెప్పారు. బయోమెట్రిక్ హాజరు నమోదు నెల వారీగా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి హాజరును బయోమెట్రిక్ ద్వారా ప్రతి శాఖ కార్యదర్శి పరిశీలించాలని చెప్పారు.
సెటైర్లు పేలుతున్నాయిగా
బయోమెట్రిక్ హాజరుకు సంబంధించి ఆయా పరికనాలను ఇప్పటికే జిల్లాలకు చేరవేశారు. చంద్రబాబు హయాంలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత ఎత్తివేశారు. తాజాగా ఇప్పుడు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి కొత్త ఏర్పాట్లు చేయకుండానే.. పరికరాలను సిద్ధం చేసుకోమంటే ప్రయోజనం ఏమిటన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న చిన్న చెట్లు కాకుండా పెద్ద పెద్ద వృక్షాలను పెంచండి.. వాటిని ఎక్కి మరీ ఇబ్బంది లేకుండా, కింద పడకుండా ఉండేలా ఏర్పాట్లూ చేసుకోండి అంటూ జగన్ సర్కారు నిర్ణయంపై సెటైర్లు పడుతున్నాయి.
Must Read ;- ఫారిన్ టూర్ కు జగన్.. ఎందుకోసమంటే?