దేశంలో యాంటీ బీజేపి సిగ్నల్స్ వస్తున్నాయా..? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పలితాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. బలం ఉంది కదాని.. నిర్మొహమాటంగా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ.. కార్పొరేట్లను ఊడిగం చేస్తూ.. దేశ ఆర్ధిక వ్యవస్ధను పూర్తి స్థాయిలో కలర్, ఫ్లేవర్ మార్చేస్తున్న బిజెపిపై వ్యతిరేకత పెరుగుతోంది. అవును.. నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో ఘోరంగా నాలుగో స్థానం తెచ్చుకున్నా.. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో సంప్రదాయక బలమున్నా కూడా.. ఓడిపోవడం ఏ సంకేతాలిస్తోంది. నరేంద్ర మోదీ మాయాజాలం ఇక పని చేయదని చెబుతున్నాయా.. లేక టీఆర్ఎస్ పాజిటివ్ ఓటు పడిందా అంటే.. ఖచ్చితంగా మోదీ వ్యతిరేక ఓట్లు పడ్డాయనే చెప్పాలి.
ఓట్లు వేసినవారంతా గ్రాడ్యుయేట్లు.. చదువుకున్నవారు. రాజకీయ పార్టీలు ఏ ప్రచారం చేసినా.. ఎంత చేసినా.. ఈసారి అవన్నీ కేంద్రం విధానాల చుట్టూ తిరగడమే.. బిజెపిని దెబ్బ కొట్టింది. ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేయడం.. వ్యాగన్ ఫ్యాక్టరీ అవసరం లేదని చెప్పడం.. అదే సమయంలో ఏపీలో స్టీల్ ఫ్యాక్టరీని అమ్మటానికి బరితెగించడం.. ఇవన్నీ బిజెపిపై వ్యతిరేకతను పెంచాయి.
మత విద్వేషాలను రెచ్చగొట్టి గ్రేటర్ ఎన్నికల్లో లాభపడినట్లు లాభపడాలని బిజెపి ప్రయత్నించింది. బండి సంజయ్ తన తీస్మార్ ఖాన్ డైలాగులను పదే పదే చెప్పినా.. దానిపై జనానికి విసుగొచ్చింది. మొదట్లో హిట్ అయిన సంజయ్ టాక్స్.. పోను పోను ఫ్లాప్ కేటగిరీలోకి వెళ్లిపోయాయి. దుబ్బాక జోష్, గ్రేటర్ హోష్ తో ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి కూడా కమలనాథులు వెళ్లిపోయారు. అది కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించింది.
లేదంటే ఆఖరి నిముషంలో ఎంట్రీ ఇచ్చిన పీవీ నరసింహారావు కూతురు వాణీదేవి విజయం సాధించడం ఏంటి? టీఆర్ఎస్ అనుకూల పరిస్ధితులైతే లేవు. కేసీఆర్ చెప్పారని ఓటేసేంత సీన్ కూడా ఇప్పుడు లేదు. అయినా వాణీదేవికే ఓట్లు పడ్డాయంటే.. అది బిజెపికి వ్యతిరేక పరిస్ధితులుండబట్టే. బిజెపి గనుక ఇలాగే మొండిగా, అడ్డగోలుగా ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేసుకుంటూ పోతే.. రాహుల్ ఎంత వీక్ అయినా కూడా కాంగ్రెస్ను గెలిపించినా గెలిపిస్తారు జనం.
Also Read : ఎమ్మెల్సీల విజయంతో విమర్శలకు చెక్.. బీజేపీకి బ్రేక్