ఆషాడ మాసం ప్రారంభం కాగానే.. తెలంగాణలోని ప్రతిఒక్కరికి బోనాల పండుగ కళ్లముందు కదలాడుతుంది. శివసత్తుల పూనకాలు.. డప్పుచప్పుళ్లు.. బోనాల ఊరేగింపు ఓ పెద్ద జాతరనే తలపిస్తుంది. బోనాలు తెలంగాణ సంప్రదాయంలో ఓ భాగం. అందుకే చాలామంది బోనాల పండుగను జరుపుకునేందుకు ఆసక్తి చూపుతారు. ప్రతి ఏటా బోనమెత్తి.. ఇష్టమైన అమ్మవార్లకు పూజలు చేస్తారు. పిల్లాపాపలను చల్లంగా దీవించు తల్లీ అని వేడుకుంటారు. గతేడాది కరోనా కారణంగా బోనాలు నిరాడంబరంగా జరిగింది. ఈ సారి మాత్రం ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేసింది. అయితే కరోనా కారణంగా భక్తుల సంఖ్య తగ్గుందని.. భావించిన దేవాదాయ శాఖ ఆన్ లైన్ లోనూ బోనాలు సమర్పించేందుకు ఏర్పాటు చేస్తోంది.
గోత్రనామాలు నమోదు చేస్తే చాలు..
కరోనా కారణంగా చాలామందికి బోనం సమర్పించే వీలు ఉండకపోవచ్చు. అలాంటివాళ్ల కోసం అధికారులు వినూత్న ఆలోచన చేశారు. ఆన్ లైన్ బుక్ చేసుకుంటే.. నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారు. గోత్ర నామాలతో సహా పేర్లు నమోదు చేస్తే.. వాళ్లే బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత పోస్టు ద్వారా బోనంలోని బియ్యం ప్రసాదంలా పంపిణీ చేస్తారు. వాటిని ఇంటి వద్దే వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చు. ఈ సారి లష్కర్ బోనాలతో ఈ తరహా వేడుకలు నిర్వహించేందకు దేవాదాయ శాఖ, ఇతర ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బోనాలను ఆన్ లైన్ లో సమర్పించేందుకు మాత్రం రూ.200 నిర్ణయించినట్టు గా తెలుస్తోంది.
బోనాల ఊరేగింపు ఇలా..
జూలై 11న గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉజ్జయిని మహంకాళి దేవాలయం సికింద్రాబాద్ వద్ద జూలై 25 న బోనాలు, జూలై 26న రంగం నిర్వహిస్తారు. హైదరాబాద్ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి ఆగష్టు 1న బోనాల పండుగను, అ మరుసటి రోజు బోనాల ఉరేగింపు జరుగుతుంది.
Must Read ;- ‘మన్ కీ బాత్’కి తెలంగాణ చాయ్ వాలా!











