మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మరణం పై టిడిపి అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ దాష్టీకాలతో చనిపోయిన వారి వివరాలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపైనా, పోలీసుల తీరుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. వివేకా హత్య కేసులో ఉన్నవారిని ఒక్కొక్కరిగా చంపేస్తారని మేం ముందునుంచి చెబుతున్నామంటూ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
నాడు “వివేకాను గొడ్డలిపోటుతో చంపేసి,దానిని గుండెపోటుగా చిత్రీకరించారని చంద్రబాబు విమర్శించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నాపైనా, తెలుగుదేశం పార్టీ పైనా నేరారోపణలు చేశారన్నారు. ఆ తర్వాత వివేకా కూతురే కోర్టుకు వెళ్లి సీబీఐ ఎంక్వైరీ వేయించారని.. ఈ విషయం అందరికీ తెలుసని అన్నారు. వివేకా హత్య కేసులో ఇప్పటిదాకా ముగ్గురు చనిపోయారని.. శ్రీనివాసులు రెడ్డి ఎందుకు చనిపోయారు? మీ మామ డాక్టర్ గంగిరెడ్డి ఎందుకు చనిపోయారు? నిన్న గంగాధర్ రెడ్డి ఎందుకు చనిపోయాడు? వీళ్లందరికీ ఆ కేసులో సంబంధం లేదా అని జగన్ ను ఆయన ప్రశ్నించారు.
శ్రీనివాసులురెడ్డి నిందితుల్లో ఒకరని.. డాక్టర్ గంగిరెడ్డితో వివేకా మృతదేహానికి ఆయన డిస్పెన్సరీలోనే కుట్లు వేయించారన్నారు.ఇక గంగాధర్ రెడ్డికి 10 కోట్లు ఆఫర్ ఇచ్చింది నిజమా? కాదా? అని ప్రశ్నించిన బాబు.. గంగాధర్ రెడ్డిని బెదిరించి సీబీఐపైనే కేసు పెట్టించారని తెలిపారు. గంగాధర్ రెడ్డి మృతితో ఇప్పటిదాకా ఈ కేసుతో సంబంధం ఉన్న వారిలో ముగ్గురు చనిపోయారని అన్నారు.
ఇక, తాను కూడా నేరంలో ఉన్నానంటూ డ్రైవర్ దస్తగిరి నేరాన్ని అంగీకరించి సీబీఐ వద్ద అప్రూవర్ గా మారిన వ్యక్తిని కూడా చంపేస్తామని బెదిరించగా, ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చిందని.. గతంలో ఎన్నడూ లేని సంఘటనలతో ఈ రాష్ట్రం ఎక్కడికీ పోతోందని ? చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
వైసీపీ దాష్టీకాలు హద్దులు మీరుతున్నాయన్న బాబు..వైసీపీ వాళ్ళు సీబీఐ డ్రైవర్ నే బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నుంచి సీబీఐ వెళ్లిపోకపోతే బాంబులేసి చంపేస్తామని హెచ్చరిస్తున్నారని.. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీబీఐకే భద్రత లేకపోతే ఇక దేశాన్ని ఎవరు కాపాడతారని ప్రశ్నించారు ? వైసీపీ వాళ్ళు కరడుగట్టిన నేరగాళ్లని.. గతంలో పరిటాల రవి హత్య కేసులోనూ ఇలాగే చేశారని తెలిపారు. ఇప్పుడు వివేకా హత్య కేసు సంబంధీకులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు.
వివేకా హత్య కేసులో ఉన్నవారిని చంపేస్తారని చెబుతూనే ఉన్నామన్న బాబు.. ఈ కేసులో మేం చెప్పినట్టే జరుగుతోందని.. ఈ వ్యవహారం సీబీఐ విశ్వసనీయతకు పెనుసవాల్ వంటిదని.. జగన్ అవినీతిపై సీబీఐ చార్జిషీటు వేసినా ఏమీ చేయలేకపోయింది” అని చంద్రబాబు పేర్కొన్నారు.
అంతకుముందు, వైసీపీ పాలనలో ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. 4 వేల మంది కార్యకర్తలపైనా, 60 మంది టీడీపీ నేతలపైనా దాడులు చేశారని, కేసులు పెట్టారని ఆరోపించారు. 37 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. నలుగురు మాజీ మంత్రులు, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారని వెల్లడించారు. ఈ మూడేళ్లలో 2,552 మంది రైతులు, 422 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. వైసీపీ పాలనలో మహిళలపైనా ఆగడాలు పెరిగాయని తెలిపారు.
ఈ దాష్టీకాలు ఇకపై జరగడానికి వీల్లేదని చెప్పడానికే తాను ఇవాళ మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఒక్క మాచర్లలోనే ఐదు హత్యలు జరిగాయని వెల్లడించారు. తాను హెచ్చరికలు చేసినప్పటికీ నిన్న జల్లయ్య అనే కార్యకర్తను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు, మాచర్ల నుంచి అనేక కుటుంబాలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. పోలీసులు అసలు డ్యూటీ చేస్తున్నారా? లేక నేరస్తులకు వంత పాడుతున్నారా?… దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని అన్నారు. అక్రమ నిర్బంధాలకు పోలీసులు కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
“అనంతబాబు అనే ఎమ్మెల్సీ… డ్రైవర్ ను చంపేసి మృతదేహాన్ని ఇంటికి పంపించి, అంత్యక్రియలు వెంటనే చేయకపోతే కేసులు పెడతామని బెదిరించారు… అసలు డీజీపీ ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాను. ఆలిండియా సర్వీసు మీరు పాసయ్యారా? అని అడుగుతున్నా. టీడీపీ తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తే ఆ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు. కానీ ఈ విషయం పక్కదారి పట్టించడానికి కులాల మధ్య చిచ్చుపెట్టారు. అసలు కోనసీమలో ఏం జరిగింది? కోనసీమలో జరిగిందానికి తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తాము ఉన్నది ఎందుకో ఆలోచించుకోవాలి” అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.