ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు నిజంగానే ఓ కొత్త తరహా మంత్రాంగం నడుస్తోంది. పార్టీ అధిష్ఠానానికి భారీ ఊరట ఇచ్చేలా సాగుతున్న ఈ వ్యూహం దెబ్బకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. ప్రత్యేకించి త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వవస్థీకరణలో మంత్రి పదవులపై గంపెడాశలు పెట్టుకున్న వారు విలవిల్లాడిపోతున్నారు. ఈ వ్యూహం దెబ్బ ఎలాగుందంటే.. సమీప భవిష్యత్తులో పార్టీకి చెందిన ఆయా నేతలు నోరు తెరచి పదవులు అడిగేందుకే సాహసించలేనంతగా దెబ్బైపోతున్నారు. చాలా వ్యూహాత్మకంగా అమలు అవుతున్న ఈ ప్లాన్తో ఇప్పటికే చాలా మంది నేతల పేర్లు మంత్రి పదవులను ఆశిస్తున్న వారి జాబితా నుంచి మాయమైపోయాయి కూడా. మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరిగేలోగా.. మరింత మంది నేతల పేర్లను కూడా ఈ వ్యూహంతోనే వైసీపీ అధిష్ఠానం జాబితా నుంచి తీసేయబోతోందన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్న వాదనలు ఆ పార్టీ నేతల అంతర్గత చర్చల్లో వినిపిస్తున్నాయి.
ఈ వ్యూహం దేనికోసం..?
మంత్రి పదవులు వద్దనుకునే వారు గానీ, వాటి కోసం యత్నించని రాజకీయ నేతలు గానీ ఉండరు కదా. ఆ క్రమంలోనే కాస్తంత మంచి విద్యార్హతలు ఉన్న వారు, తమ పేరు బాగానే జనంలో నానేలా చేసుకునే వారు, విపక్షాలపై విరుచుకుపడి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న వారు, సామాజిక వర్గాల సమీకరణలను ముందు పెట్టి పదవులను ఆశించేవారు.. ఇలా చాలా రకాలుగా నేతలు తమకు పదవులు ఇవ్వాలని అధిష్ఠానం ముందు పెడతారు కదా. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోనూ అదే జరుగుతోంది. రెండున్నరేళ్ల తర్వాత చాలా మంది మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తానని జగన్ ఆదిలోనే చెప్పారు కదా. ఇప్పుడు రెండున్నరేళ్లు ముగిసిపోయాయి. ప్రస్తుత మంత్రివర్గాన్ని పూర్తిగా తొలగించేసి కొత్త వారితో సరికొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తన మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న వారందరినీ పిలిచి పదవులు పీకేస్తున్నట్లుగా చెప్పేశారు కూడా. పాత మంత్రులను తీసేస్తే.. ఇక్ కొత్త మంత్రుల ఎంపిక జరుగుతోందన్నట్లే కదా. మరి జగన్ ఆ దిశగా యత్నాలు చేస్తుంటే.. పదవులను ఆశించే నేతలు కూడా తమ వంతు యత్నాలు చేస్తారు కదా. అందులో భాగంగా చాలా మంది నేతలు జగన్ కు ప్రతిపాదనలు పంపుతున్నారట. అయితే ఇప్పటికే జగన్ తన కొత్త మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలన్న విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారట. అయితే మరి ఆశావహులందరిని.. వారిలో అసంతృప్తి రగలకుండానే ఎలా వెనక్కు తగ్గేలా చేయాలి? ఈ దిశగా ఆలోచించిన జగన్.. ఓ బ్రహ్మాండమైన ప్లాన్ను రచించారట.
ఈ వ్యూహం ఏమిటంటే..?
చాలా పకడ్బందీగా రచించి అమలు చేస్తున్న ఈ వ్యూహంలో భాగంగా మంత్రి పదవులను ఆశిస్తున్న నేతలకు సొంత నియోజకవర్గంలోనే కుంపట్లను ఎగదోస్తున్నారు. తొలిసారే మంత్రి పదవి ఖాయమని భావించిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సంబంధించి సదుం మండలంలో అధిష్ఠానం అసమ్మతిని ఎగదోసింది. సదుం మండలంలో ఎంపీపీ ఎన్నికకు సంబంధించి రోజాకు అసమ్మతి వర్గాన్ని క్రియేట్ చేశారు. ఫలితంగా రోజాకు సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి సెగలు రాజుకున్నాయి. సొంత పార్టీ నేతల నుంచే ఢీ అంటే ఢీ అన్న రీతిలో రోజా తలపడాల్సి వచ్చింది. ఆ తర్వాత గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి సంబంధించి దేవతల విగ్రహాల పక్కన ఆమె ఫొటో కనిపించేలా వ్యూహం రచించి ఆమెను ఇరుకున పెట్టేశారు. ఇక ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి తల్లికి జడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టి.. స్థానిక ఎమ్మెల్యే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు అసమ్మతి సెగను తగిలించారు. తాజాగా అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని భూవివాదంలో చిక్కుకునేలా వ్యూహం రచించారు. ఈ తరహా ప్లాన్లతో ఈ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు ఇవ్వమని అడిగే అవకాశం లేకుండా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ తరహా అసమ్మతి సెగలు తగిలే అవకాశాలున్నాయన్న వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి.