కొంతమందకి చెబితే వింటారు.. లేదా అనుభవంతో వింటారు.. ఇది వ్యక్తులకు, వ్యవస్థలకూ వర్తిస్తోంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమకు ఇందులో మినహాయింపు ఉంటుందనేలా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వరుస పరాభవాలు ఎదురైనా నాయకుల్లో మార్పు రావడంలేదని సోంత పార్టీలోనే కొందరు పెదవి విరుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా నేతలకు మాత్రం చీమకుట్టినట్లు అయినా లేదని పార్టీలో చర్చ జరుగుతోంది.
గందరగోళంలో ఆశావాహులు..
త్వరలో జరగబోయే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, ఖమ్మం-నల్గొండ, వరంగల్ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ,సీపీఎం, టీజేఎస్ పార్టీలు ముందస్తు ప్రణాళికలతో సాగిపోతున్నాయి. ప్రత్యేక ఎన్నికల కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతను తమ మీద వేసుకును ముందుకు సాగుతున్నారు. మరీ కాంగ్రెస్ నాయకుల్లో ఎలాంటి చలనం లేదు. ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లాలా.. వద్దా.. అనే గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. పోటీకి ఆసక్తి కనబరుస్తున్న వారి నుంచి పార్టీ దరఖాస్తులను స్వీకరించింది. అయితే ఫైనల్గా బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను డిసైడ్ చేయకుండా.. దరఖాస్తు చేసుకున్న వారందరూ ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని చెప్పడంతో ఆ నాయకులంతా గందరగోళంలో పడ్డారు. ఫీల్డ్ లోకి వెళ్లాలా వద్దా? ఒక వేళ వెళ్లినా ఖర్చు పెట్టిన తరువాత తమ పేరు ప్రకటించకుంటే తమ పరిస్థితి ఏంటని ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఓటర్ల పేర్లు నమోదు ప్రక్రియలో ఏ నాయకుడు అంతగా సీరియస్గా ఫోకస్ పెడ్తలేరనే టాక్ వినబడుతోంది.
దుబ్బాకపైనే ఫోకస్…
ప్రస్తుతం ఏ పార్టీ పెట్టనంత ఫోకస్ను కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఉప ఎన్నికపైనే పెట్టింది. బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిస్తుండటంతో తామెక్కడ బరిలో వెనుకబడిపోతామోనని భావించి కాంగ్రెస్ రాష్ట్ర నేతలందరూ అక్కడే మోహరించారు. మెయిన్ లీడర్లందరూ విడతల వారీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. గెలుపు కోసం సీరియస్గానే ఈసారి కాంగ్రెస్ అక్కడ ప్రయత్నం చేస్తోంది. అయితే దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ కూడా పోటీ చేస్తున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ముందునుంచే ప్రత్యేక దృష్టి సారించాయి. కానీ ఇలాంటి వ్యూహం కాంగ్రెస్ పార్టీలో లోపించినట్లు పార్టీ క్యాడర్లో టాక్ వినబడుతోంది. ఇదిలా ఉంటే ఓటర్ల నమోదు ప్రక్రియకు గడువు దగ్గరపడుతోంది. ఇంత వరకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. తమ నాయకత్వం ఇక మారరు అనే అసహనాన్ని కిందిస్థాయి కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానాలు రెండే.. పేర్లు 20కి పైగానే..
ఉన్నవి రెండు పట్టభద్రుల స్థానాలు.. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచే ఆశావాహుల సంఖ్య మాత్రం 20 వరకు ఉంది. పోటీ చేసేందుకు ఎవరికివారు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. గతంలో చాలా మంది పేర్లు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంపై కాంగ్రెస్ సీనియర్ నేత గూడురు నారాయణరెడ్డి పోటీ చేసేందుకు ఇంట్రస్ట్గా ఉన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ వల్ల లోక్సభ ఎన్నికల్లో భువనగిరి టికెట్ మిస్సయి ఆయన నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారైనా తనకు ఎమ్మెల్సీ టికెట్ కన్ఫామ్ చేయాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే మరో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ కూడా హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి స్థానం నుంచి పోటీ చేసేందుకు సుముఖత చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ఆసక్తితో ఉన్నారు. తనకు మద్దతుగా టిక్కెట్ కోసం రేవంత్రెడ్డి.. పార్టీపై ఒత్తిడి తెస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే చిన్నారెడ్డి, సంపత్, వంశీచందర్రెడ్డిలు సైతం బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్నారు. మరోపక్క అభ్యర్థులను తేల్చకుండా ఎలా ఎన్నికల్లో ముందుకు పోవాలని పార్టీలో చర్చించుకుంటున్నారట. ఎదురు దెబ్బలు ఎన్ని తగులుతున్న నేతల తీరు మాత్రం మారడం లేదనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.











