మనసు కవి ఆత్రేయ మంచి చమత్కారి అనే సంగతి చాలా మందికి తెలియదు. ఆయనతో సన్నిహితంగా ఉండేవారికి మాత్రమే ఆయన పంచ్ లు ఎంత పవర్ ఫుల్లో తెలిసేది. ఎవరికీ తెలయని విషయమేమిటంటే ఆయన ఇంట్లో ఓ బూతద్దం ఉండేదట. అది ఆయన్ని వదిలేది కాదు. మేడపై ఉన్న గదిలో ఆయన మంచం పక్కనే ఓ చిన్న టీపాయ్ ఉండేది. దానిపైన చిన్న బూతద్దం అక్కడికి వచ్చిన వారందరికీ కనిపిస్తుండేది. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే ఆ అద్దం గురించి తప్పకుండా అడిగేవారు.
‘ఈ భూతద్దంతో మీకేం పని… దీంతో ఏంచేస్తుంటారు?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికాయన చిరునవ్వు నవ్వి తాపీగా ఓ తమాషా సమాధానమిచ్చేవారట. ‘నా దగ్గరకు చాలా మంది కథలు తెస్తుంటారు. మరికొందరు పాట కోసం సన్నివేశం చెప్పడానికి కథా భాగం రాసి తెస్తారు. వాటిలో అసు కథా వస్తువు ఎక్కడుందో ఈ బూతద్దం పెట్టుకుని వెతుకుతాను’ అని చమత్కరించేవారట. నిజానికి అసు విషయం ఏమిటంటే…ఆత్రేయగారికి హస్తసాముద్రికంతో కొద్దిపాటి పరిచయం ఉంది. అందుకని ఎవ్వరూ లేనప్పుడు సరదాగా ఆయన తన చేతిలో రేఖను చూసుకునేవారట. ఈ వయసులో ఆయనకు ఈ ఆసక్తి ఏమిటని అనిపించేది కొందరికి.
ఆ విషయాన్నే ఆయన్ని అడిగితే తన మేనమామ హస్తసాముద్రికంలో చాలా గొప్పవారని, అంతేగాక జ్యోతిషంలో ఉద్ధండ పండితుడని చెప్పుకొచ్చేవారు. ఆయనకు పూర్ణాయుష్షు ఉందని ఆయన మేనమామ చెప్పినా ఆత్రేయలో ఓ అనుమానం ఉండేదట. వయస్సు కూడా పైబడటంతో ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బందు వస్తాయేమోనని చేతి రేఖల్ని పదే పదే చూసుకుంటూ అంచనా వేసుకుంటూ ఉండేవారు. ఇలా అనుమానం ఉంటే ఆయన పాడవుతుందని ఆయన శిష్యులకు అనిపించి ఆయనను ఓ జ్యోతిష్కుడి దగ్గరకు తీసుకెళ్లారు.
ఆ జ్యోతిష్కుడు టి.నగర్లో రాజేశ్వరీ జ్యోతిషాలయం నడిపేవారు. ఆయన ఆత్రేయ జాతక చక్రం వేసి ‘అంతా సరిగానే ఉంది…కానీ … అది మీ అసిస్టెంట్కు మాత్రమే చెబుతానులెండి’ అన్నారు. దాంతో ఆయన ‘సరే…నువ్వు విని రావయ్యా’ శిష్యుడితో అనేసి ఆయన కారులో వెళ్లిపోయారు. అప్పుడు జ్యోతిష్కుడు మరో జ్యోతిష్కుడితో చర్చించుకుని ఆత్రేయ శిష్యుడికి ఓ రహస్యం చెప్పారు. అదేంటంటే ఆత్రేయకు డాక్టరేట్గానీ, ప్రభుత్వపరంగా పద్మశ్రీ లాంటి పురస్కారాలుగానీ, విదేశీ పర్యటనగానీ వచ్చిందో ఆ తర్వాత ఆరు నెలలోగా ఆయనకు మృత్యుగండం ఉంటుందని చెప్పారట. ఈ విషయాన్ని ఆ శిష్యుడు ఆత్రేయకు చెప్పలేదు. ఆయనకు డాక్డరేట్ ఇస్తామని కొంతమంది పెద్దలు అన్నప్పుడు అది తీసుకోవద్దంటూ ఆ శిష్యుడు ఆయన్ని బతిమాలేవాడట.
‘ఎందుకలా అంటున్నావంటూ’ ఆయన చాలా సార్లు ఆ శిష్యుడిని నిలదీశారు. అనుమానం వచ్చిన ఆయన రాజేశ్వరీ జ్యోతిష్యాయానికి ఫోన్ చేసి తెలుసుకున్నారట. తన శిష్యుడికి తన మీద అంత ప్రేమ ఉన్నందుకు ఆత్రేయకు చాలా ఆదరంగా నన్ను దగ్గరికి తీసుకుని…‘ఎందుకలా ఊరికే భయపడతావు…నేనీ చావు గురించి చాలా రోజు క్రితమే ఓ చిన్న కవిత చెప్పాను. అదేమిటంటే…‘చావంటే నాకెందుకు భయం.. నేను ఉన్నప్పుడు అది రాదు.. అది వచ్చినప్పుడు నేనుండను.. ఎలా ఉంది?’.. అంటూ తేలిగ్గా నవ్వేశారు. కానీ విధి దాన్నంత తేలిగ్గా తీసుకోలేదు. డాక్టరేట్తో ముందుకొచ్చి మళ్లీ ఊరించింది.
ఈమారు ఆత్రేయ ఆ డాక్టరేట్ ను ఆహ్వానించారు. ‘అదేమిటో చూద్దాం …ఆత్రేయ అంత తేలిగ్గా పోతాడా…’ అన్నారు ఆయన ఆత్మీయులు. కానీ జ్యోతిష్కుడు చెప్పిన మాటే నిజమైందట. డాక్టరేట్ తీసుకున్న ఆరు నెల్లోగానే ఆయన కన్నుమూశారు. హస్త రేఖల్ని ఆయన బూతద్దంలో చూడగలిగారేగానీ మరణాన్ని చూడలేకపోయారు. అదన్న మాట సంగతి. ఆత్రేయ శిష్యుడే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఆయనెవరో కాదు.. గురుచరణ్. రచయిత జేకే భారవి, గురుచరణ్ లు ఆయన దగ్గర అసిస్టెంట్ లుగా ఉండేవారు. భారవి అసలు పేరు భట్టాచార్య. గురుచరణ్ కూడా ఆ తర్వాత చాలా సినిమాలకు పాటలు రాశారు.











