టూల్ కిట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ దిశకు బెయిల్ మంజూరైంది. ప్రభుత్వంతో విభేధించినంత మాత్రానా దేశద్రోహం కేసు ఎలా పెడతారంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ‘తాము చేసే విధానాలను, చట్టాలను వ్యతిరేకించారన్న కారణంతో ప్రభుత్వాలు పౌరులను కటకటాల్లోకి నెట్టడం ప్రజాస్వామ్య దేశంలో సమ్మతం కాదు. ప్రభుత్వాల అహం, అభిమానం గాయపడిందన్న నెపంతో దేశద్రోహం కేసును నమోదు చేయరాదు.. అసమ్మతి వ్యక్తీకరణ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. భేదాభిప్రాయాలు, అసమ్మతి, విభేదం, విరోధం ఇవన్నీ ప్రభుత్వ విధానాలపై నిష్పాక్షిక దృక్పథం కలిగించే ఉపకరణాలు.చైతన్యవంతంగా, నిర్భీతిగా మనోభావాలు వెల్లడించే పౌరసమాజం ఉండటం ఓ సజీవమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి చిహ్నం. అంతేగానీ.. ప్రభుత్వంతో విభేదించినంత మాత్రాన దేశద్రోహం కేసులు నమోదు చేయడం సరికాదు’ అని ఢిల్లీలోని పటియాలా హౌస్ లోని ఓ కోర్టు వ్యాఖ్యానించింది.
అరాకొరా ఆధారాలు..
పోలీసులు సమర్పించిన ఆధారాలు అరకొరగా ఉన్నాయని, ఏమాత్రం హేతుబద్ధంగా లేవని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఆమెకు నేరచరిత్ర లేదని, ఖలిస్థాన్ ఉద్యమానికి ఊతమిస్తోందని చెబుతున్న సిఖ్స్ ఫర్ జస్టిస్ తో సంబంధమున్నట్లుగా కూడా ఎలాంటి ఆధారాలూ లేవని పేర్కొంది. ‘జనవరి 26న జరిగిన హింసతో ఆమెకు ప్రమేయమున్నట్లు చూపే ఆధారాల్లేవు. దేశాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ఆమె కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు రెండు వెబ్సైట్ల హైపర్లింక్స్ చూపారు. వాటిలో అభ్యంతరకరమైనవేవీ లేవు. ఆలోచనలు తప్పు కావొచ్చు, వాటిలో అతిశయోక్తి ఉండొచ్చు, ఆఖరికి కలహ కారణమైన దుర్మార్గమైనవీ కావొచ్చు..కానీ హింసను ప్రేరేపించనంత కాలం వాటిని దేశద్రోహం కింద జమకట్టడం సరికాదు’ అని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా పేర్కొన్నారు. పోలీసులు ఇంకా ఆధారాల సేకరణలోనే ఉన్నారని, ఈ క్రమంలో ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించలేమని వ్యాఖ్యానించిన ఆయన.. దిశ రవికి బెయిల్ మంజూరు చేశారు. రూ. లక్ష పూచీకత్తుతో పాటు అంతే మొత్తంలో రెండు సమానమైన హామీలను కూడా ఆమె సమర్పించాల్సి ఉంటుందని ఆయన తీర్పిచ్చారు.
సంచలనమైన దిశ కేసు
స్వీడిష్ పర్యాపరణ ప్రేమికురాలు గ్రెటా షేర్ చేసిన టూల్కిట్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు.. అందులో భాగంగా దిశ దేశద్రోహానికి పాల్పడిందంటూ ఈ నెల 13 వ తేదీన తనని అదుపులోకి తీసుకున్నారు. దిశను విడుదల చేయాలంటూ.. దేశవ్యాప్తంగా యువత తనకు అండగా నిలిచారు. తన నోరు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఎమర్జెన్సీ పెట్టకుండానే ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్న వాతావరణం కనిపిస్తుంది. ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకంగా నోరెత్తినా.. ట్వీట్ చేసినా చాలు.. ఎత్తి జైల్లో పడేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. లేక నియంతృత్వ పాలనలో ఉన్నామో అర్థం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ప్రభుత్వం విధానాలు బాగాలేదు అని చెప్పాలన్నా భయపడాల్సిన రోజు రావడం ఖాయం.
Must Read ;- పర్యావరణ పరిరక్షణేనా.. దిశ రవి వెనుక ఖలిస్థాన్ ఉందా?