వరంగల్ లో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా రాజకీయం రంజుగా మారింది. బండి సంజయ్ వరంగల్ పర్యటన అనంతరం అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. స్థానిక నేతలే టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికీ అవే మంటలు వరంగల్ లో రేగుతున్నాయి. వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రాంతంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏ చిన్న సమస్య వచ్చినా టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా బీజేపీ దూకుడుగా విమర్శలు చేస్తోంది. వరంగల్ లో అభివృద్దిపై భద్రకాళి ఆలయంలో చర్చకు సిద్దమా అంటూ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలను మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
బీజేపీపై టీఆర్ఎస్ ఎదురు దాడులు..
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నుండి జిల్లా స్థాయి నేతల వరకు అంతా టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు సైతం బీజేపీ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు . ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం మాని అభివృద్దిపై చర్చకు రావాలంటూ సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకు వచ్చి వరంగల్ అభివృద్దికి కృషి చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేస్తూ పబ్బం గడుపుకోవడం తప్పితే బీజేపీ నేతలు చేసేదేమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా టీఆర్ఎప్ పై మాటల దాడులు చేస్తూనే ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ టార్గెట్ గా బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు తోడు ఆయన కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎర్రబెల్లికి తలనొప్పులు..
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సొంత జిల్లాల్లో తీవ్ర ప్రతిగట ఎదురవుతోంది. ఆయన పర్యటనకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. తన తమ్ముడు బీజేపీలో చేరడం ఖాయం అయ్యిందన్న వార్తల నేపథ్యంలో బీజేపీపై ఆయన విమర్శలు మరింత ఎక్కవ చేస్తున్నారని స్థానిక నేతలు చెబుతున్నారు . కాకతీయ యూనివర్సీటిలో వీసీ నియామకంతో పాటు అనేక సమస్యలపై స్థానిక మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ చేసిందేమీ లేదంటూ ఆయన యూనివర్సిటీ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసారు ఏబీవీపీ విద్యార్థులు. పోలీసుల సహకారంతో ఆయన యూనివర్సిటీలోకి వెళ్ళిన అడ్డుకున్న విద్యార్థి సంఘాల నేతలపై ఎర్రబెల్లి వెంట వచ్చిన పోలీసు దురుసు ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక తాజాగా డబల్ బెడ్రూం ఇల్ల నిర్మాణం విషయంలో స్థానిక మహిళలు తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఆయన పర్యటనలో నిరనసణ వ్యక్తం చేస్తూ డబ్బులకు ఇల్లు అమ్ముకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు మహిళలు. దీంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు తగులుతున్న ఎదురుదెబ్బలను ఆయన ఎలా ఎదుర్కొంటారు.. ప్రజల ఆగ్రహాన్ని ఎలా తగ్గించుకుంటారన్న ఆసక్తి కర చర్చ సాగుతోంది వరంగల్ జిల్లాలో