రియల్ హీరోగా అందరి చేత పిలవబడుతున్న సోనూసూద్ ఎక్కడికి వెళ్లినా అక్కడ అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు. కోవిడ్ కాలంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కార్మికులను వాళ్ల సొంత ఊర్లకు చేర్చడంలోనే కాదు పేదలకు విద్య, వైద్య సహాయాలను అందించడంలో తన సొంత నిధులను ఖర్చు చేస్తూ రియల్ హీరోగా అందరి దృష్టిని సోను ఆకట్టుకున్నారు. దాంతో ఆయన ఎక్కడ వున్నా..ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకాభిమానులు తండోపతండాలుగా చుట్టిముట్టి జేజేలు పలుకుతున్నారు. ఆయన ఆటోగ్రాఫ్స్ తీసుకునేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎనలేని ఉత్సహాన్నిప్రదర్శిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం సెట్లో కూడా సోనూకు అభిమానుల నుంచి అలాంటి గొప్ప అనుభవం ఎదురైంది. కొద్దిరోజుల క్రితం ‘ఆచార్య’ చిత్రం చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోని కోకాపేటలో జరుగుతోంది. చిరంజీవి సొంత ఫామ్ హౌస్ లో నిర్మించిన సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవితో పాటు సోనూ సూద్, ఇంకా ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు.
కాగా సోనూ సూద్ షూటింగులో ఉన్న విషయం తెలుసుకున్న అభిమానులు లొకేషన్ వద్దకు చేరుకొని మరీ ఆయనకు జిందాబాద్ లు పలికారు.అది తెలుసుకున్న సోనూ అభిమానుల చెంతకు చేరి వారితో కొద్దిసేపు ఆనందంగా ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగారు. బాధలలో ఉన్న కొందరు అభిమానులతో ప్రత్యేకంగా కూడా మాట్లాడినట్లు సమాచారం.