హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వరుసబెట్టి ప్రతి రౌండ్లో ఆధిక్యం సాధిస్తూ వస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. 8వ రౌండ్లో మాత్రం ప్రతికూల ఫలితం వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లో మాత్రమే ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్.. వరుసగా ఏడు రౌండ్ల పాటు వెనుకంజలో సాగింది. అయితే అనూహ్యంగా 8వ రౌండ్లో గెల్లు శ్రీనివాస్ ఆధిక్యం సాధించారు. ఈ రౌండ్లో ఈటల కంటే గెల్లుకు 162 ఓట్ల ఆధిక్యం లభించింది. అయినా గానీ.. మొత్తంగా చూస్తే.. 8వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్పై బీజేపీదే ఆధిక్యమని చెప్పాలి. 8వ రౌండ్ ముగిసేసరికి..ఈటలకు 35,107 ఓట్లు రాగా.. గెల్లుకు 31,837 వచ్చాయి. వెరసి 8వ రౌండ్ ముగిసేసరికి గెల్లుపై ఈటల 3,270 ఓట్ల మెజారిటీ సాధించారు.
ప్లేట్ తిరగబడేనా?
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఆది నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధిస్తూ వస్తున్నారు. ప్రతి రౌండ్లో వందల ఓట్ల తేడాతో ఆధిక్యం సాధిస్తూ వచ్చిన ఈటల.. ఓ రౌండ్లో ఏకంగా వెయ్యి ఓట్ల మేర ఆధిక్యాన్ని సాధించారు. అయితే అనూహ్యంగా 8వ రౌండ్ వచ్చేసరికి ఈటలపై గెల్లు శ్రీనివాస్ 162 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 22 రౌండ్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గెల్లుకు 8వ రౌండ్లో కనిపించిన ఆధిక్యం మిగిలిన రౌండ్లలో కూడా కనిపిస్తే.. ఈటల ఓటమి ఖాయమే. అలా కాకుండా ఈటల మళ్లీ పుంజుకుంటే మాత్రం టీఆర్ఎస్కు ఓటమి తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గెల్లు ఊళ్లోనూ ఈటలదే ఆధిక్యం
ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం హిమ్మత్ నగర్కు చెందిన వారు. ఈ ఊరి ఓట్లను 8వ రౌండ్లో లెక్కించారు. అయితే ఇక్కడ కూడా.. అంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంతూరైన హిమ్మత్ నగర్లోనూ ఈటలకే మెజారిటీ దక్కింది. ఈ గ్రామంలో ఈటలకు 549 ఓట్లు రాగా.. స్వగ్రామంలో గెల్లుకు కేవలం 358 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. గెల్లు స్వగ్రామంలోనూ ఈటలకు ఆధిక్యం దక్కిందన్న మాట.
Must Read ;- వైసీపీ గెలిచినా టార్గెట్ మిస్!