అంతా అనుకున్నట్లుగానే ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపకు చెందిన బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. అభ్యర్థికి ఘన విజయం దక్కినా.. వైసీపీ మాత్రం తన లక్ష్యాన్ని చేరుకోలేక చతికిలబడిపోయింది. మొత్తంగా చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా.. లక్ష్యాన్ని మిస్ అయినప్పటికీ.. అభ్యర్థి గెలుపుతో వైసీపీ సరిపెట్టుకుందన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బద్వేల్ నుంచి గెలిచిన డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ క్రమంలో గత నెల 30న జరిగిన ఎన్నికల్లో వెంకటసుబ్బయ్య సతీమణి సుధను వైసీపీ తన అభ్యర్థిగా ప్రకటించగా.. సంప్రదాయాన్ని గౌరవించిన టీడీపీ, జనసేన పోటీ నుంచి తప్పుకున్నాయి. అయితే ఆ సంప్రదాయాన్ని పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్లు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. గత శనివారం జరిగిన పోలింగ్ ఏకపక్షంగా సాగిందన్న వాదనలు వినిపించాయి. ఆ వాదనలన్నీ నిజమేనన్నట్లుగా మంగళవారం నాటి కౌంటింగ్లో పోస్టల్ బ్యాలెట్తో పాటుగా తొలి రౌండ్ నుంచి కూడా వైసీపీ అభ్యర్థి సుధ స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగారు.
మెజారిటీ 90,228 ఓట్లు
మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన బద్వేల్ ఓట్ల లెక్కింపు 12.30 గంటలలోగానే పూర్తి అయ్యింది. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధకు 1,11,710 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పనతల సురేశ్కు 21,612 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు 6,191 ఓట్లు పోలయ్యాయి. వెరసి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్పై వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,228 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో తన భర్త వెంకటసుబ్యయ్యకు వచ్చిన 44 వేల మెజారిటీని మించి రెట్టింపు మెజారిటీతో సుధ విజయం సాధించినట్లైంది. ఇదిలా ఉంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఓ మోస్తరు ఓటు షేరింగ్ ఉన్న జనసేన కూడా బరిలో లేకున్నా.. బీజేపీ కనీసం డిపాజిట్ ను కూడా దక్కించుకోలేకపోయింది.
లక్ష మార్కు దాటలేదే
తన సొంత జిల్లాకు చెందిన బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనగానే.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందన్న నేపథ్యంలో బద్వేల్ను రెవెన్యూ డివిజన్గా చేస్తామని ప్రకటించారు. స్వయంగా బద్వేల్లో భారీ బహిరంగ సభ పెట్టారు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే.. జిల్లాకు చెందిన మంత్రులతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎంట్రీ ఇచ్చారు. వీరందరినీ రంగంలోకి దించిన సందర్భంగా.. డాక్టర్ సుధకు లక్ష ఓట్లకు తగ్గకుండా మెజారిటీ రావాల్సిందేనని జగన్ ఆదేశాలు జారీ చేశారు. జగన్ మాటను నిజం చేసేలా వైసీపీ నేతలు కూడా బాగానే శ్రమించారు. అదే సమయంలో చనిపోయిన నేత కుటుంబ సభ్యులను పోటీకి దింపితే.. పోటీ చేయరాదన్న సంప్రదాయాన్ని గౌరవిస్తూ టీడీపీ, జనసేనలు పోటీ నుంచి తప్పుకున్నాయి. అయినా కూడా జగన్ చెప్పినట్లుగా వైసీపీ అభ్యర్థి మెజారిటీ లక్ష మార్కుకు 10 వేల ఆవలే నిలిచిపోవడం గమనార్హం. ఇదే ఇప్పుడు బద్వేల్ ఫలితాల్లో హాట్ టాపిక్గా మారింది.
Must Read ;- జగన్ దొంగ ఓట్లను ఎంచుకున్నారే!