ఈనెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ఎంపిలతో ఆయన చర్చించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తరువాత బేగంపేటలోని ప్రగతిభవన్లో ఈ భేటీ జరగనున్నకట్లు తెలిసింది. జిఎస్టీ విషయంలో తెలంగాణపై కేంద్ర అనుసరిస్తున్న వైఖరి ఇతర అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు తెలంగాణ విభజన చట్టంలోని తెలంగాణకు దక్కాల్సిన హక్కులు తదితర అంశాలు చర్చకువచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ శాసన సభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సిఎం తమ పార్టీ ఎంపీలతో సమావేశం అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ వాయిస్ను బలంగా వినిపించేలా తమ పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం అవలంభిస్తున్న తీరును పార్లమెంట్ సభలో గట్టిగా ఎండగట్టేలా ప్రతి సభ్యుడు సంసిద్ధమై పార్లమెంట్ సమావేశాలకు హాజరై తెంగాణ బాణిని వినిపించాలని వారికి సూచించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న తీరును, పార్లమెంట్లో చర్చకు వచ్చే అంశాలపైనే ఈ సమావేశం ఉండనున్నట్లు సమాచారం.