ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోంది. గత వారం రోజుల్లోనే రెండు దిగ్గజ కంపెనీలు ఏపీకి వస్తున్నట్లుగా ప్రకటించాయి. హెచ్సీఎల్ కంపెనీ సాఫ్ట్ వేర్ రంగంలో తన పెట్టుబడులు విస్తరిస్తున్నట్లుగా ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. 5 బిలియన్ల యూఎస్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫాంమ్ ఎవ్రెన్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా గోద్రెజ్ సంస్థ కూడా ఏపీలో పెట్టుబడి పెట్టనుంది. అమరావతితో పాటు విశాఖపట్నంలో తమ కంపెనీ రూ.2800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించింది. గోద్రెజ్ సీఎండీ నాదిర్ గోద్రేజ్ సీఎం చంద్రబాబును కలిసి.. తన అంగీకారం తెలిపారు. గోద్రెజ్ సంస్థ సీఎండీ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలోని ఆ సంస్థ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులపై తమ ఆసక్తులను, ఉద్దేశాలను సీఎంకు గోద్రెజ్ ప్రతినిధులు వివరించారు.
అగ్రీ, పెస్టిసైడ్స్, ఆక్వా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రేజ్ ఆసక్తి కనబర్చింది. వీటి వల్ల ఏపీ ఆర్థిక రంగం బలోపేతం అయ్యేందుకు అవకాశం కూడా ఉంటుందని, పైగా రైతులకు కూడా మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది. వంట నూనెలు, పామాయిల్ ఉత్పత్తి పెంచే అంశం కూడా వీరి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలిసింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది వివిధ సంస్థలతో గతంలో వెనక్కి వెళ్లిన కంపెనీలతో కూటమి ప్రభుత్వం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇలా ఏపీకి కొత్తగా రాబోతున్న కంపెనీలన్నీ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా అమరావతితో పాటు విశాఖ, ఇంకా వేరే ప్రాంతాలకు కూడా విస్తరించేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.