కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించడం లేదని అమరరాజా బ్యాటరీ సంస్థను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు ఇచ్చిన ఆదేశాలను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీల తయారీ కంపెనీ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల కార్మికులు, సమీప గ్రామాల ప్రజల రక్తంలో సీసం ఎక్కువగా ఉందని, వెంటనే సంస్థను మూసివేయాలని, విద్యుత్ సరఫరా కూడా వెంటనే నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ బోర్డు గత వారం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై అమరరాజా యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై ఇవాళ వాదనలు జరిగాయి. జూన్ 17లోపు కాలుష్య నియంత్రణ బోర్డు సూచించిన అన్ని నిబంధనలు అమలు చేయాలని అమరరాజా బ్యాటరీ సంస్థల యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. అమరరాజా సంస్థలను మూసివేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ధర్మాసనం కొట్టివేసింది. వెంటనే సంస్థను తెరిపించాలని హైకోర్టు ఆదేశించింది. అదుపరి విచారణను జూన్ 25వ తేదీకి వాయిదా వేసింది.
అన్ని సక్రమంగా ఉన్నాయి
కాలుష్య నియంత్రణలో గతంలో తమ సంస్థకు అనేక అవార్డులు కూడా వచ్చాయని, తాజాగా కాలుష్య నియంత్రణ బోర్డు లేవనెత్తిన అంశాలను కూడా సరి చేస్తామని అమరరాజా బ్యాటరీ సంస్థల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వచ్చే నెల 17 కల్లా కాలుష్య నియంత్రణ బోర్డు సూచనలు అమలు చేయాలని ధర్మాసనం సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కాలుష్య నియంత్రణ బోర్డును హైకోర్టు ఆదేశించింది.











