ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భీమవరంలో జన్మించిన బైర్రాజు రామలింగరాజు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసుకొని వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడాలని ఆశించారు. నిర్మాణ రంగంలో కొన్ని సంవత్సరాలు పని చేశారు. తన తండ్రి బైర్రాజు సత్యనారాయణ రాజు అడుగుజాడలలో నడిచి వస్త్ర వ్యాపారంలోనే కొనసాగాలని ముందుగా నిర్ణయించుకున్నారు. తన స్నేహితుడు ఇచ్చిన సలహ ఆయన జీవితాన్నే మార్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజిలో కాంట్రాక్టు లెక్చరర్ గా పని చేశారు. తన తండ్రికిచ్చిన మాట మేరకు పది మంది చేత శెభాష్ అనిపించుకోవాలనే తపనతో సాఫ్ట్ వేర్ సేవలను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చరిత్ర సృష్టించింది.
1987లో రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ ను స్థాపించారు. కేవలం 20 మందితో నెలకొల్పిన ఈ సంస్థ దినదినమానంగా పెరుగుతూ వచ్చింది. 1992లో పబ్లిక్ లిస్టింగ్ కు వెళ్లిన ఈ కంపెనీ నిధులను భారీగా సేకరించి బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. 1994లో ఐటీ సేవల కోసం ఇంటర్నేషనల్ కంపెనీ బ్రాడ్ స్ట్రీట్ తో ఒప్పందం చేసుకోవడంతో సత్యం కంప్యూటర్స్ దేశ, విదేశాలలో చరిత్ర సృష్టించింది. ఇక అక్కడి నుంచి సత్యం కంప్యూటర్స్ టీసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజాల సరసన నిలిచింది. ఆయా కంపెనీల ఫౌండర్స్ కు లేని ఓ ప్రత్యేకత రామలింగరాజుకు ఉంది. తాను నడుపుతున్న సత్యం కంప్యూటర్స్ సంస్థ పేరు ప్రతిష్ఠలతో పాటు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జించడంతో రామలింగరాజు తనలో ఉన్న మరో కోణాన్ని ప్రజలకు పరిచయం చేశారు.
తనను ఉన్నత స్థితికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ముందుగా తన ప్రాంత ప్రజలకూ, రాష్ట్ర ప్రజలకూ, దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికీ ఏదైనా లాభం కలిగే పని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి మరణంతో బైర్రాజు ఫౌండేషన్ ను నెలకొల్పిన ఆయన 25 సేవలను అందించారు. విద్యా, వైద్య, ఉపాధి, పర్యావరణ పారిశుద్యం, మంచినీరు, క్రీడలు, అత్యవసర సేవలు లాంటి సేవలను ముందుగా తన ప్రాంత ప్రజలకు అందచేశారు. ఆగస్ట్ 15 2001న స్థాపించిన ఈ ఫౌండేషన్ కాలక్రమంగా అంబులెన్స్ లను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించింది. 2003లో ‘సహాయ’ పేరిట అత్యవసర సేవలను బైర్రాజు ఫౌండేషన్ ద్వారా రాజు గారు ప్రారంభించారు. ఈ సేవలను తన ప్రాంతానికే పరిమితం చేయకుండా దేశ వ్యాప్తంగా చేయాలనే తపనతో 108 అత్యవసర సేవలను ఏర్పాటు చేయాలని కలలు కన్నారు.
రాజు గారి ఆలోచనకు సత్యం కంప్యూటర్స్ లో పని చేసిన ఎందరో సహయ-సహకారాలు అందించారు. రాజు గారి ఆశయాలకు అనుగుణంగా సీఈఓ వెంకట్ చెంగపల్లి ఈ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరింపచేశారు. యూఎస్ లో 911 సేవల స్ఫూర్తిగా దీనిని రూపకల్పన చేశారు. 2005 ఆగస్ట్ 15న ఈ సేవలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్, కేంద్ర మంత్రి దయానిధి మారన్ ప్రారంబించారు. ఈ సేవలు 10 రాష్ట్రాలకు విస్తరించి 45 కోట్ల మందికి లబ్ది చేకూరింది. వీటితో బాటు తమ సంస్థలలో పని చేసే వారికి వృత్తితో బాటు ఇతర విషయాలలో కూడా ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకునేవారు. ఆయన సంస్థలో సీనియర్ విభాగాలలో పని చేసేవారు అందరూ తెలుగు ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం. దీనిని బట్టి తమ ప్రాంతాల వారికి రాజు గారు ఎంత గుర్తింపు ఇస్తారో తెలుస్తుంది.
కోట్లాది మందికి వైద్యం, విద్య, ఉపాధి కల్పించి దేవుడిగా నిలిచిన రామలింగరాజు అతి పెద్ద కుంభకోణంలో చిక్కుకున్నారు. ఇన్వెస్టర్లు ఎదురుతిరగడంతో ‘మైటాస్’ కొనుగోలు నిర్ణయాన్ని ఆయన రద్దు చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఐటీ చరిత్రలోనే భారీ కుంభకోణంగా సత్యం కంప్యూటర్స్ నిలిచింది. ఒక్కడే స్థాపించిన ఈ కంపెనీని 2 బిలియన్స్ టర్నోవర్ స్థాయికి తీసుకువెళ్లిన ఆయన కలల సౌధం కుప్పకూలింది. 2009 జనవరి 6న జరిగిన సమావేశంలో తానే స్వయంగా ‘పులి మీద స్వారీ చేశానని’ ప్రకటించినా దేశ, విదేశాలలో ఆయనకు మద్దతుగా కోట్లాది మంది ప్రజలు నిలిచారు. కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. మానవతావాదిగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అక్షర శుభాకాంక్షలు.









