ఏపీలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుక తవ్వకాలు, విక్రయాలు, రవాణాలో ఎక్కడా అక్రమాలకు తావులేదని సీఎం జగన్మోహన్రెడ్డి నమ్మకంగా చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అధికార పార్టీ నేతలకు కమీషన్లు ఇస్తూ అనుచరులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం హనుమాన్పాలెం ఇసుక క్వారీ నుంచి అధికార పార్టీ నేతల అండతో ఇసుకాసురులు రోజుకు 1000 లారీల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. లారీల రొదతో గ్రామంలో ఉండలేకపోతున్నామని ఇసుక లారీలను ఆపివేసి నిరసన తెలిపారు. తమపై కేసులు పెట్టినా లారీలను పోనిచ్చేది లేదని గ్రామస్థులు పోలీసులకు తేల్చి చెప్పారు.
ఇసుక పాలసీ ఏమైంది?
ఏపీలో ఇసుక తవ్వకాలకు కొత్త పాలసీ తీసుకు వస్తున్నామని ప్రభుత్వం 6 నెలలుగా చెబుతూనే ఉంది. అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇంత వరకు కొత్త ఇసుక పాలసీ అమల్లోకి తీసుకురాలేదు. వైసీపీ నేతలను సంతృప్తి పరచేందుకుకే సీఎం కొత్త ఇసుక పాలసీని వాయిదా వేస్తూ వస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో ఎక్కడ చూసినా అక్రమంగా మట్టి తవ్వకాలు, ఇసుక తవ్వకాలతో వైసీపీ నేతలు, వారి అనుచరులు రెచ్చిపోతున్నారు. అడిగిన వారిపై దాడులకు దిగుతున్నారు. దీంతో రోజూ కోట్లాది రూపాయల ఇసుక అక్రమార్కుల పాలవుతోంది.
Must Read ;- మంత్రి అండతో నది గుల్ల.. కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు