జనసేనాని రాజకీయంగా బాగా యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. నివర్ తుపాను తర్వాత.. భారీ వర్షాల్లో తడుస్తూనే ఆయన నష్టపోయిన రైతులను పరామర్శించారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేయాలో.. ఒక డిమాండు వినిపించారు. తాను చెప్పినట్లుగా ప్రభుత్వం చేయకపోతే.. తాను ఏం చేయబోతున్నానో ప్రభుత్వానికి ఒక ఫత్వా ఇచ్చారు. ఆ ఫత్వా మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ కేడర్ తో కలిపి తాను కూడా కూర్చుని.. ఒక పూట ఇంట్లోనే దీక్షలు చేశారు.
అక్కడితో.. రైతులకోసం పవన్ కల్యాణ్ పోరాటాలు తుది అంకానికి వచ్చాయని అనుకుంటే పొరబాటే. ఇప్పుడు మళ్లీ కలెక్టరు కార్యాలయాల్లో తన పార్టీ వారు రైతులకోసం వినతిపత్రాలు ఇవ్వాలంటూ ఒక కొత్త కార్యచరణకు పిలుపు ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన జనసేన పార్టీ నాయకులు.. ఏపీలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వబోతున్నారు. నివర్ నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో రైతులందరికీ ముందుగా ఎకరాకు పదివేల రూపాయల వంతున తక్షణసాయం అందించాలని, ఆ తర్వాత.. ఎకరాకు కనీసం 35 వేల రూపాయల వరకు నష్టపరిహారం ఇవ్వాలనేది జనసేన డిమాండ్. ఈ ఉద్యమ కార్యచరణ ద్వారా.. రైతుబాంధవ ఇమేజి తన సొంతం అవుతుందని జనసేనాని అనుకుంటున్నారో ఏమో తెలియదు.
రైతు ప్రేమ అంటే ఇంతేనా సార్!
ఇటీవలి తుపానుల దెబ్బకు ఏపీలో రైతులు బాగానే నష్టపోయారు! వారికి ప్రభుత్వమూ తాము అనల్పమైన సాయం చేస్తున్నట్టుగానే ప్రకటించింది. తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని ప్రకటనలైతే వచ్చాయి. ఆచరణలో రైతు కన్నీళ్లు తుడవడానికి.. ప్రకటనలకు మధ్య కొంత వ్యత్యాసం ఎటూ ఉంటుంది. అయితే విపక్ష తెలుగుదేశం కూడా రైతులకు మద్దతుగా గళం వినిపించింది. లోకేష్ ఊరూరా తిరిగి రైతులతో మాట్లాడి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. పోల్చిచూస్తే.. జనసేనాని పవన్ కల్యాణ్ ఇంకాస్త గట్టిగా స్పందించారు. నిన్నటి పరామర్శలు, దీక్షలు, రేపు కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తున్నారు.
అయితే రైతు ప్రేమ అంటే ఇదేనా? అనే సందేహం ప్రజలను వెన్నాడుతోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా అన్నదాతలు.. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కి పోరాడుతున్నారు. 20 రోజులకు పైగా ఢిల్లీ శివార్లలో నానా అగచాట్లు పడుతున్నారు. వారిలో తెలుగు రైతులు లేకపోవచ్చు.. కానీ రైతు ప్రేమ ఉంటే వారి కష్టాలు, వారి విలాపాలు కూడా పవన్ కల్యాణ్ కు కనిపించాలి కదా? అనేది ప్రజల్లోని సందేహం.
భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు, రైతుల అసలు విలాపాలను పట్టించుకోకుండా పవన్ మౌనం పాటిస్తున్నారనేది ప్రజల ఆరోపణ. భారత్ బంద్ సందర్భంలోనూ ఏపీలో ప్రభుత్వం బంద్ కు మద్దతిచ్చింది. తెలుగుదేశం క్రియాశీలంగా పాల్గొంది. జనసేన మాత్రం సైలెంట్ గా ఉంది. వారి ఏడుపులను చెవిన వేసుకోకుండా.. నిర్లక్ష్యంగా ఉంటూ.. కేవలం ఆచరణలో సాధ్యమయ్యే అవకాశం ఎంత మాత్రమూ లేని డిమాండ్ ను జగన్ సర్కారు ఎదుట పదేపదే వినిపించినప్పటికీ.. తనొక రైతు బాంధవుడిని అనే ఇమేజిని పవన్ కల్యాణ్ ఎలా కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు.
పవన్ లో రైతుల పట్ల, వారి కష్టాల పట్ల నిజంగానే ప్రేమ ఉంటే గనుక.. జగన్ ఏమాత్రం పట్టించుకునే అవకాశం లేని పదివేల సాయం డిమాండ్ ను పదేపదే వినిపించడం మాత్రమే కాదు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్ ఆయనకు తప్పనిసరి కావచ్చు గానీ.. దేశం అట్టుడికి పోతున్న రైతుల కష్టాల మీద.. తనకు సత్సంబంధాలు ఉన్న కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించాలి.











