ఫిధా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి సాయి పల్లవి. ఎంతో సింపుల్ గా కనిపించే ఈ అమ్మడు తన సహజసిద్ధమైన నటన, అధ్బుతమైన డాన్స్ స్టెప్పులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఎం.సి.ఏ., పడి పడి లేచే మనసు, మారీ 2 , వంటి చిత్రాలలో అద్భుతమైన నటనను కనబర్చిన సాయి పల్లవి మంచి సక్సెస్ ను కూడా అందుకుంది.
గత యేడాది ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన ‘లవ్స్టోరీ’లోను, తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో విడుదలైన ‘శ్యామ్ సింగా రాయ్’ చిత్రంలో నటించగా ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి.అయితే ప్రస్తుతం ఈ చిత్రాల సక్సెస్ తర్వాత సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ఒప్పుకోవడం లేదని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో కొత్త చిత్రాల ఆఫర్లు వస్తున్నా అంగీకరించడం లేదు. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
సాయిపల్లవి పెళ్ళి పీటలెక్కబోతోందని.. అందువల్లే ఆమె తనకు వస్తున్న ఆఫర్లకు నో చెబుతోందనే ప్రచారం సాగుతోంది. ఇక ఇదే అంశంపై సాయిపల్లవి స్పందిస్తూ.. ‘తెలుగు, తమిళ భాషల్లోని ప్రేక్షకుల్లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు, పేరు ఉంది. సాయిపల్లవి అంటే సంతృప్తికరమైన పాత్రల్లో మాత్రమే నటిస్తారనే భావన ప్రేక్షకుల్లో ఉంది. అందుకే మంచి కథతో కూడిన చిత్రాలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాను. అంతకుమించి మరో కారణం అంటూ ఏదీలేదు’ అని ఆమె తన వివరణ ఇచ్చింది.