అనంతపురం జిల్లాలో టీడీపీ కీలక నేత జేసీ దివాకర్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ ఇంటర్వ్యూలో చేసిన విమర్శలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కొన్ని అనుమానాలకు కూడా తావిస్తున్నాయి. అవతల ఉన్నది ఎవరైనా.. తాను చెప్పాలనుకున్నది చెప్పడం, అనాలకున్నది అనడం అలవాటు ఉన్న జేసీ దివాకర్ రెడ్డి..ముందు చూపుతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. 1978 నుంచి జేసీ కుటుంబం రాజకీయాల్లో కీలకంగా ఉంది. ఇటు ఉమ్మడి ఏపీలో, అటు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాయలసీమలో ఏ పార్టీ ఆధిపత్యం సాగించినా జేసీ కుటుంబం తన పట్టును నిలుపుకుంటూ వస్తోంది. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక తమ కుటుంబం చాలా అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, రోజుకో కేసుతో వెంటాడుతున్నారనే అభిప్రాయం ఆ కుటుంబానికి ఉన్న నేపథ్యంలోనే జేసీ దివాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కూడా గమనించవచ్చు.
బీజేపీ జాతీయ కార్యదర్శితో భేటీ..
గత నెలలో చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో జేసీ మాట్లాడుతూ..పోలీసులపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదైంది. బెయిల్ పేపర్లు వచ్చినా.. జేసీ దివాకర్రెడ్డి ఐదు గంటలకు పైగానే..స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. ఆ తరువాతి రోజే అంటే..జనవరి 5న జేసీ దివాకర్రెడ్డి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్తో చాలా సేపు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం మొదలైంది. దీనిపై జేసీ తనదైన శైలిలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయి. బీజేపీలో చేరతారా అనే ప్రశ్నకు ఆయన.. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలిపినప్పుడు బీజేపీలో చేరతానని సెటైర్ వేశారు. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొన్ని అంశాలు కూడా కీలకంగా మారాయి.
కనిపిస్తున్న నిరాశ..
చంద్రబాబు టైం వేస్ట్ చేస్తారని చెబుతూనే..ఆయన మారతారనే ఆశ ఉండేదని, ఇక మార్పు వస్తుందన్న నమ్మకం కూడా పోయిందన్నారు. అంటే చంద్రబాబు నుంచి మార్పును జేసీ ఆశించి ఉండవచ్చని, ఆ ఆశ నెరవేరలేదనే నిరాశ కనిపిస్తోందనే చర్చ మొదలైంది. గతంలోనూ బయట వేదికలపైనా, పార్టీ వేదికలపైనా జేసీ దివాకర్రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. జగన్ మావాడే కాని..మూర్ఖుడని, చంద్రబాబు గతంలో మాదిరిగా సాఫ్ట్గా పాలన సాగించాలంటే కుదరదని, మా చేతులు కట్టేశారని ఇలా..చాలా సార్లు వ్యాఖ్యానించారు. ఇక కడప జిల్లా టూర్లో జగన్పై పరోక్షంగా సెటైర్లు వేశారు. సీఎం జగన్ తన వ్యాపారాలను దెబ్బతీశారని, ట్రావెల్స్ని మూసేశారని, వ్యవసాయం చేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనుక.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక..జేసీ కుటుంబంపై నమోదవుతున్న కేసులు, ఆర్థికంగా దెబ్బకొట్టే నిర్ణయాలు కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మైనింగ్కి అడ్డుకట్ట..రూ.100కోట్ల జరిమానా..
ఇక జేసీ కుటుంబానికి అతిపెద్ద ఆర్థిక వనరులు..మైనింగ్, సిమెంటు వ్యాపారాలు, ట్రావెల్స్ మాత్రమే. ఇతరత్రా స్థిరాస్తులు, పెట్రోల్ బంకుల్లాంటి వ్యాపారాలున్నా.. వాటికంటే మైనింగ్, సిమెంట్ కంపెనీ ఆదాయం ఎక్కువగా ఉండేది. జగన్ అధికారంలోకి వచ్చాక.. వారి కుటుంబానికి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ, మైనింగ్కు సంబంధించి రూ.వంద కోట్ల జరిమానా విధించడం సంచలనం రేపింది. జరిమానా చెల్లించని పక్షంలో ఆస్తుల జప్తునకు కూడా నోటీసు తీసుకోవాల్సి వచ్చింది. ఇక బీఎస్ 3 వాహనాలను అక్రమంగా బీఎస్ 4గా మార్చారన్న ఆరోపణలపై బస్సులను సీజ్ చేయడం, ఆయన తమ్ముడు ప్రభాకర్రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిని కూడ అరెస్టు చేశారు. ఇక ఇటీవలే ప్రభాకర్రెడ్డి ఇంటిపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన అనుచరులు దాడి చేయడంతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గతంలో ఎన్నడూ జరగని రీతిలో.. జేసీ బ్రదర్స్కి పెద్ద షాక్ గానే భావించాల్సి ఉంటుంది. ఇక దాడుల కేసులు, పాత కేసులు, ధర్నాల కేసులు చాలా ఉన్నాయి. ఈ పరిణామాలు ఎలా ఉన్నా.. తప్పొప్పులు ఎవరివి అయినా.. ఇలాగే కొనసాగితే తాడిపత్రి చేజారుతోందనే అభిప్రాయంతో జేసీ బ్రదర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయ వారసత్వం కోసం..
కొన్నాళ్ల క్రితం జేసీ దివాకర్రెడ్డి చేసిన ఓ ప్రకటన కూడా జేసీ కుటుంబం అడుగులు ఎటువైపు పడతాయనే అంచనాకు కారణం అవుతోంది. తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని జేసీ దివాకర్రెడ్డి గతంలోనే ప్రకటించారు. అంటే పరోక్షంగా రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు తేల్చేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు పవన్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇన్ని అవమానాలు జరుగుతున్నా, ఇన్ని వేధింపులు జరుగుతున్నా.. జేసీ దివాకర్రెడ్డి కుటుంబం టీడీపీలో కొనసాగడంపై పవన్రెడ్డిలో కొంత అసహనం వ్యక్తం అవుతోందనే అభిప్రాయం కొనసాగుతోంది. అదే సమయంలో వైసీపీకి వెళ్లే ప్రశ్నే లేదని, జగన్ తనకు మిత్రుడైనా..పాలిటిక్స్ వేరు అనే అభిప్రాయంలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి వెళ్తే ఎదురయ్యే పరిస్థితులపై చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక రాయలసీమలో బీజేపీకి కీలకనేతలు పెద్దగా లేరు. ఈ నేపథ్యంలో జేసీ రాకతో..సీమలో పట్టు పెంచుకోవచ్చని కూడా బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్రెడ్డి వైపు నుంచి పావులు కదుపుతున్నట్లు సమాచారం.