కాంగ్రెస్ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని, పిచ్చి మాటలు మానుకోవాలని హితవుపలికారు. ఈ మధ్య బీజేపీ వాళ్లు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా తయారయ్యారని, వారిలా మాట్లాడడం తనకు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని, అడ్డదిడ్డంగా తనకు అడ్డొస్తే.. తొక్కి పడేస్తానని హెచ్చరించారు. బుధవారం నల్లగొండ జిల్లా హాలియాలో నిర్వహించిన రైతు ధన్యవాద సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
పిడికెడు లేరు.. నన్నడ్డుకుంటారా..
సభలో సీఎం మాట్లాడుతుండగా.. బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. దీనిపై కేసీఆర్.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మొత్తం పిడికెడు మంది లేరు. మేం తలుచుకుంటే నశం కూడా మిగలరు’ అని హెచ్చరించారు. ఏదైనా చెప్పదలచుకుంటే సభ పెట్టుకొని చెప్పాలి తప్ప.. వేరే సభ కాడ లొల్లి చేసుడు సంస్కారం కాదని వ్యాఖ్యానించారు. ‘ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నాయకులు పొలం బాట, పోరు బాట అని బయలుదేరారు. ఏమైంది పొలానికి? ఇవాళ మీకు నీళ్లొస్తున్నయ్.. ఆ నీళ్లు అవసరం లేదా?’ అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలోనే డిండి ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బీసీ టన్నెల్, ఉదయ సముద్రం ప్రాజెక్టులు పూర్తి కాబోతున్నాయని చెప్పారు. ‘మాకు ప్రజలు తీర్పునిచ్చారు, మీలాగా ఢిల్లీకి వెళ్లి నామినేట్ అయి వచ్చిన ప్రభుత్వ కాదు.. మీలా డంబాచారం చేసే ప్రభుత్వం కాదు. మాటంటే మాటే. మిషన్ భగీరథతో నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడగమని చెప్పినం. ప్రూవ్ చేసుకున్నం. అదీ టీఆర్ఎస్ పార్టీ అంటే’ అని కేసీఆర్ చెప్పారు.
దళితుల కోసం..
‘తెలంగాణలో నేడు ఉన్న స్థితికి, ఆనాడు ఉన్న దుస్థితికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరు కూడా ఉచ్ఛరించే అర్హత లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరు? వాస్తవాలు తెలుసుకోవాలి. దళిత జాతి వెనుకబడింది. ఒప్పుకోవాలి. సబ్ప్లాన్ తెచ్చి వారిని అభివృద్ధి చేసినం. ఇంకా అభివృద్ధి చేసేందుకు దళిత సాధికారతకు వచ్చే బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించబోతున్నాం. ఆ పథకానికి నా పేరే పెడతా. నేనే ఆ స్కీంను పర్యవేక్షణ చేస్తా. రాబోయే రోజుల్లో ఆ పథకానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు కేటాయిస్తా’ అని సీఎం ప్రకటించారు.
సాగునీరు..
కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. త్వరలోనే అర్హులందరికీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. సాగర్ ఎడమ కాల్వ కింద ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు రూ.2,500 కోట్లతో 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశానని, వీటన్నింటినీ ఏడాదిన్నరలోపు పూర్తి చేసి నీళ్లందిస్తామని అన్నారు. ఈ లిఫ్టులన్నింటినీ పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ప్రకటించారు.
Must Read ;- ఎన్టీయేలోకి కేసీఆర్ జై.. బీజేపీ నై..?











