దేవతలు .. దానవులు ఎంతో కష్టపడితేనేగానీ వాళ్లకి ‘అమృత భాండం’ లభించలేదు. కానీ తెలుగువారి పుణ్య విశేషం వలన ఎలాంటి కష్టాలు పడకుండానే వాళ్లకి ఓ ‘అమృత భాండం’ దొరికింది .. అది ‘గానామృత భాండం’ .. దాని అసలు పేరే ఘంటసాల.
ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే ఘంటసాల ఒక ‘కరపత్రం’ కాదు .. ఒక పేజీలో చదువుకోవాలనుకుంటే ఘంటసాల ఒక ‘పాఠం’ కాదు .. ఒక గంటలో పూర్తిచేయాలనుకుంటే ఘంటసాల ఒక ‘పుస్తకం’ కాదు .. ఘంటసాల ఒక చరిత్ర. అవును .. అది కష్టం – ఇష్టం పెనవేసుకున్న చరిత్ర, ఆకలి – ఆశయం కలిసిన చరిత్ర. ఘంటసాల అనుభవాలు అక్షరాలుగా మారితే, అధ్యయనం చేయడానికి ఆయనది ఆకాశమంత చరిత్ర.
ఘంటసాల అంటే నిలువెత్తు తెలుగుదనం .. ఆకాశమంతటి ఆత్మగౌరవం .. మంచితనమే తెలిసిన మనసు .. మాధుర్యమే ఎరిగిన స్వరం .. విశాలమైన కళ్లు .. ప్రేమను కురిపించే చూపులు .. కల్మషం తెలియని నవ్వు .. కళ్ల నిండుగా కనిపిస్తాయి. బంగారానికైనా మెరుగు పెట్టాలి .. వజ్రానికి కూడా సానపెట్టాలి .. అప్పుడే అవి ప్రకాశిస్తాయి. అలా ఘంటసాల కూడా తన స్వరానికి సాధన నేర్పారు .. ఆ స్వరానికి సంగీత సంపదను అందించారు.
ఘంటసాల హాయిగా అరుగుల మీద కూర్చుని తాపీగా పాడుకుంటూ పైకి రాలేదు. గాయకుడిగా ఆయన ఎదగడానికి వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి .. మరెన్నో ఇబ్బందులు ఉన్నాయి. పస్తులతో సంగీత పాఠాలు నేర్చుకోలేక ఒక పూట ‘భిక్ష’ మెత్తుకుని, మరోపూట కుళాయి నీళ్లలో కన్నీళ్లు కలుపుకుని తాగి కడుపునింపుకున్న సందర్భాలు ఉన్నాయి. సంగీతం నేర్చుకోవడం కోసం కటికనేలపై పడుకున్న రాత్రులు .. సాధనలో తనని తాను మరిచిపోయి తడిసిన మంచుకురిసే ఉదయాలు ఉన్నాయి.
కష్టపడకుండా ఎవరూ ఎదగలేరు .. ఆ కష్టాన్ని ఒక తపస్సులా భావించకపోతే ఎవరూ ఏదీ సాధించలేరు. ఘంటసాల మహా గాయకుడు కావడానికి ఎన్నో కష్టాలు పడ్డారనే విషయం ఆయన జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆయన పూర్తి పేరు .. ఘంటసాల వెంకటేశ్వరరావు. కృష్ణాజిల్లా ‘చౌటుపల్లి’ గ్రామంలో 1922 .. డిసెంబర్ 4వ తేదీన రత్తమ్మ – సూర్యనారాయణ దంపతులకు ఆయన జన్మించారు. సూర్యనారాయణకి భక్తి ఎక్కువ .. ఆయన భజన పాటలు అద్భుతంగా పాడేవారు. ఆయన ఆరుగురు సంతానంలో ఒకరైన ఘంటసాల, తండ్రి ప్రభావం కారణంగా బాల్యం నుంచే సంగీతం పట్ల ఆసక్తిని కనబరుస్తూ ఉండేవారు. సంగీతం పట్ల తనకిగల ఇష్టం .. వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది.
విజయనగరం మహారాజావారి సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకోవాలనే పట్టుదలతో, తన దగ్గరున్న బంగారు ఉంగరాన్ని 8 రూపాయలకు అమ్మేసిన ఘంటసాల, ఇంట్లో చెప్పకుండానే విజయనగరం వెళ్లిపోయారు. ద్వారం వెంకటస్వామినాయుడుగారిని కలుసుకుని తన పరిస్థితిని చెప్పుకుని ఆయన అనుమతిని పొందారు. సంగీత పాఠాలైతే మాస్టారు చెబుతానన్నారు .. కానీ కడుపునిండుగా అన్నం పెట్టేవారెవరు? అందువల్లనే ఆయన ‘జోలె’ కట్టుకుని బ్రాహ్మణుల వీధిలో ప్రతి రోజూ ‘భిక్ష’ స్వీకరించడం మొదలుపెట్టారు.
సంగీతం పట్ల ఆయనకి గల తపనకి ఇది నిలువెత్తు నిదర్శనం .. ఆయనలోని కార్యదీక్షకి తిరుగులేని నిర్వచనం. అలా ఎన్నో కష్టాలుపడిన ఆయన, సంగీతంలో ‘విద్వాన్’ పట్టాను సంపాదించుకున్నారు. ఆ తరువాత ఘంటసాల చేసిన ఒక కచేరీకి వచ్చిన ఆదిభట్ల నారాయణదాసు, తన బహుమానంగా ఘంటసాలకు ఒక ‘తంబుర’ను అందజేశారు. గాయకుడిగా ఘంటసాల సాధించనున్న విజయాలకు ఇది ఒక ముందస్తు సూచికగా చెప్పుకోవచ్చు.
ఘంటసాల వివాహం ఆయన దగ్గరి బంధువుల కుటుంబానికి చెందిన ‘సావిత్రి‘తో జరిగింది. సంగీతం వచ్చింది .. సంసారం ఏర్పడింది .. జీవితంలో ఎలా స్థిరపడాలో తెలియని అయోమయంలో ఘంటసాల ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే ఘంటసాలవారి పాట విన్న ‘సముద్రాల రాఘవాచార్య’, సినిమాల్లో గాయకుడిగా ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అంతేకాదు మద్రాసు వచ్చి తనని కలవమని చెప్పి మరీ వెళ్లారు. సముద్రాల రాఘవాచార్య పట్ల గల నమ్మకంతో ఘంటసాల మద్రాసు వెళ్లగా ఆయన ఆదరించారు.
ఘంటసాలను వెంటబెట్టుకుని వెళ్లి సినీ ప్రముఖులకు పరిచయం చేశారు. అలా ‘స్వర్గసీమ’ సినిమా కోసం ఘంటసాల తొలిసారిగా పాడారు. ఆ తరువాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉత్సాహంగా అడుగులు వేశారు .. ఆ అడుగులు పరుగుగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈలోగా ఘంటసాల కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించడాన్ని కొసమెరుపుగానే చెప్పుకోవాలి.
ఒక వైపున సినిమా పాటలతో .. మరో వైపున ‘పుష్ప విలాపం’ వంటి ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఘంటసాల పేరు మారుమోగిపోవడం మొదలైంది. శృంగార గీతాలు .. భక్తి గీతాలు .. విరహ గీతాలు .. పౌరాణికాల్లో పద్యాలు .. సంగీత ప్రధానమైన పాటలు .. ఇలా ఏ రసమైనా, ఏ అంశమైనా ఘంటసాల గాత్రంలో ఇమిడిపోయాయి .. ప్రేక్షకుల హృదయాల్లో ఒదిగిపోయాయి. పౌర్ణమినాటి వెన్నెల పరచుకున్నట్టుగా, తెలుగు పాటను ఆయన పూర్తిగా అలుముకున్నారు. లీలా .. జిక్కీ .. సుశీల .. జానకితో ఆయన పాడిన ప్రతి యుగళగీతం ఓ ఆణిముత్యమై నిలిచింది .. సోలోగా పాడిన ప్రతి పాటా ఓ జాతిరత్నమై వెలిగింది.
Must Read ;- నిజంగా ఇది చాలా బాధాకరమన్న ఘంటసాల తనయుడు
గాయకుడిగా ఒక వైపున తీరిక లేకుండా ఉన్న ఘంటసాల, సంగీత దర్శకుడిగాను ప్రయోగాలు చేశారు. అఖండ విజయాలను అందుకున్న ఎన్నో సినిమాలకు ఆయన సంగీతం వెన్నెముకగా నిలిచింది. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా సక్సెస్ అయిన ఏకైన వ్యక్తి ఘంటసాల అని చెప్పక తప్పదు. ఘంటసాల పాటల్లో మధురమైనవి ఏవి? మనోహరమైనవి ఏవి? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం, సముద్ర తీరంలో కూర్చుని కెరటాలను లెక్కపెట్టడమంత కష్టం. ఆయన ప్రతి పాటా మనసు తలుపు తడుతూనే ఉంటుంది .. హృదయపు లోతులను తాకుతూనే ఉంటుంది .. అనుభూతి పరిమళమై అలుముకుంటూనే ఉంటుంది.
తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. తుళు .. హిందీ భాషల్లోను ఘంటసాల పాటలు పాడటం గొప్ప విషయం. వివిధ దేశాల్లోను అప్పట్లోనే ఆయన కచేరీలు ఇవ్వడం మరో విశేషం. అలా ఘంటసాల గానం ఎప్పుడో ఎల్లలు దాటిపోయింది. సముద్రమంతటి అనుభూతికి సరిహద్దులు లేవని చాటి చెప్పింది. ఆనాటి అగ్రకథానాయకులకు మాత్రమే కాదు, కమెడియన్స్ కి కూడా పాడి మెప్పించడం ఘంటసాల ప్రత్యేకత. పీబీ శ్రీనివాస్ తన వాయిస్ లో కొన్ని సున్నితమైన భావాలను పలికించే తీరును ఘంటసాల మెచ్చుకునేవారు. చిత్తూరు నాగయ్యతో కలిసి పాడటాన్ని తన అదృష్టంగా చెప్పుకునేవారు. ‘లవకుశ’ సినిమాలో చిత్తూరు నాగయ్యకి పాడవలసి వస్తే, ఆయన అనుమతి తీసుకుని మరీ పాడటం ఘంటసాల సంస్కారానికి నిదర్శనం.
జీవితంలో ఆర్ధికంగా కుదురుకుంటున్న సమయంలోనే ఘంటసాలకి సినిమాల నిర్మాణంపై ఆసక్తి కలిగింది. దాంతో ఆయన ‘పరోపకారం’ .. ‘సొంతవూరు’ సినిమాలను నిర్మించారు. ఈ రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఘంటసాల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ అప్పులను తీర్చడానికి ఆయన ఎన్నో అవస్థలు పడవలసి వచ్చింది .. కొన్ని స్థిరాస్తులను సైతం కోల్పోవలసి వచ్చింది.
పాటల సాహిత్యంలో వచ్చిన మార్పులను ఘంటసాల గమనించారు. అప్పటి నుంచి ఆయన సినిమా పాటలను తగ్గిస్తూ .. కొత్తగా వచ్చిన గాయకులను ప్రోత్సహిస్తూ వెళ్లారు. తెలుగు చిత్రపరిశ్రమకి రెండు కళ్లవంటి ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఇద్దరూ కూడా ఘంటసాలను ఎంతో అభిమానించేవారు. తమ విజయాల్లో అర్ధభాగం ఘంటసాల మాస్టారుకే దక్కుతుందని వాళ్లు అంగీకరించడం ఆయన ప్రతిభకు కొలమానం.
కెరియర్ తొలినాళ్లలో ఘంటసాల వాయిస్ ‘మైక్’ కి పనికిరాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హెచ్.ఎం.వి. సంస్థవారే, ఆయనతో ‘భగవద్గీత’ పాడించడానికి పూనుకోవడం విశేషం. ఆరోగ్యం సహకరించని రోజుల్లోనే ఆయన ‘భగవద్గీత’ ప్రాజెక్టును భుజాన వేసుకున్నారు. విశ్రాంతి తీసుకోవలసిన రోజుల్లో విరామమనేది లేకుండా సాధన చేశారు. అలా ఆయన చేసిన తపస్సుకి ఫలితంగానే తెలుగువారి ఇళ్లలో .. దేవాలయాలలో ఇప్పటికీ ‘భగవద్గీత‘ మోగుతూనే ఉంది. అందులో ఆయన ఆలపించిన ప్రతి శ్లోకం రసాలూరే ఒక తేనెపట్టే! ఆలయ శిఖరాల మీదుగా ఆ శ్లోకాలు తేలుతూ వచ్చి మన చెవిన పడుతున్నంత కాలం ఘంటసాలకు మరణం లేనట్టే!!
మధురమైన కంఠంతో మంత్రముగ్ధులను చేసిన కారణంగా ఘంటసాలకు ‘పద్మశ్రీ’ అవార్డు దక్కడం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా ఆయన నియమించబడటం, భక్తి ప్రపంచానికి బహుమానంగా ‘భగవద్గీత’ను అందించడం .. గాయకుడిగా ఆయన జీవితాన్ని సార్ధకం చేసిన అపురూప ఘట్టాలుగా కనిపిస్తాయి. ఘంటసాల పాడిన పాటలన్నీ ఒక ఎత్తు .. ఆయన ఆలపించిన ‘భగవద్గీత’ ఒక ఎత్తు.
Also Read ;- ఆ గానం .. ఓ గంగా ప్రవాహం (ఏసుదాసు జన్మదిన ప్రత్యేకం)
ఈ రెండింటికీ తెలుగువారి గుండెగదుల్లో సుస్థిరమైన స్థానం దక్కింది. ఘంటసాల ఒక పాటల కోట .. స్వరాల ఊట .. ఆయన గురించి చెప్పుకోవడమంటే, సముద్రాన్ని దోసిట్లో పట్టి చూపించడమే అవుతుంది .. ఎవరెస్టు శిఖరాన్ని వెదురుముక్కతో కొలవడమే అవుతుంది. ఈ రోజున ఆయన వర్ధంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ స్వర సార్వభౌముడిని ‘ది లియో న్యూస్’ స్మరించుకుంటోంది.
— పెద్దింటి గోపీకృష్ణ