గులాబీ దళపతి కన్ను ఇక ఖమ్మం నగరంపై పడింది. వచ్చే ఏడాదిలో ఖమ్మం కార్పొరేషన్కి ఎన్నికలు జరగే ఛాన్స్ ఉందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ తన దృష్టిని ఖమ్మం నగరంపై మరల్చినట్లు తెలుస్తోంది. ఈ నేథ్యంలోనే అక్కడ తమ పార్టీకి చెందిన కార్పొరేటర్ల పనితీరుపై సీక్రెట్గా సర్వే చేయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది.
తమ పార్టీ ప్రజాప్రతినిధులపై టీఆర్ఎస్ పార్టీ చేయించిన సర్వేతో అధికారపార్టీ కార్పొరేటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఆ సర్వేలో ఎవరి జాతకం ఎలా ఉంది? ఈ సారి టిక్కెట్ దక్కుతుందా.. లేదా? అనే గుబులు పట్టుకుంది. 2016లో ఖమ్మం నగరానికి 50 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 34 డివిజన్లను టీఆర్ఎస్ పార్టీ సాధించుకుంది. అయితే ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పార్టీకి 42 మంది కార్పొరేటర్లున్నారు. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచి అధికారపార్టీలో జాయిన్ అయిన వారు అందులో ఉన్నారు. అయితే ప్రజాప్రతినిధుల పనితీరు గ్రౌండ్ లెవల్లో తెలుసుకునేందుకు గులాబీ బాస్ అక్కడి నేతలకు తెలియకుండానే వారిపై సర్వే జరిపించినట్లు తెలిసింది. గత నెలలోనే ఈ సర్వే మొత్తం పూర్తయినట్లు టాక్. ఈసారి కూడా ఖమ్మం నగర పాలక సంస్థపై గులాబీ జెండా ఎగురవేసేందుకే ఈ సర్వేను చేయించినట్లు తెలుస్తోంది. ఆ సర్వేద్వారా కొంత మంది కార్పొరేటర్లు పనితీరు మార్చుకోవాలని, లేకుంటే వేటు పడదనే సంకేతాలను కూడా ఇప్పటికే ఇచ్చేశారట.
డివిజన్ల వారీగా సర్వే…
మొత్తం 50 డివిజన్లలో సర్వే నిర్వహించగా, ప్రతి డివిజన్లో 180 మందిని కలిసి స్థానిక కార్పొరేటర్లపై, ప్రభుత్వ పని తీరుపై అభిప్రాయాలను సేకరించారు. వారం రోజుల పాటు నగరవ్యాప్తంగా ఈ సర్వేను స్థానిక నాయకులకే తెలియకుండా జరిపించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో 50 డివిజన్లలో 34 డివిజన్లు టీఆర్ఎస్ పార్టీ గెలుపొందితే ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారు మరో 8 మంది ఉన్నారు. ఇలా మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 42 డివిజన్లు ఉన్నాయి. అయితే ఈ సారి కూడా 40 స్థానాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చే రాబోయే ఎన్నికల్లో కైవసం చేసుకునేలా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర నేతలకు గులాబీ బాస్ దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది.
మెజార్టీ నేతలపై బ్యాడ్ రిపోర్టు..
అయితే సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 50 డివిజన్లలో నిర్వహించిన సర్వేలో సుమారు 30 నుంచి 40 డివిజన్లలో బ్యాడ్ రిపోర్టు వచ్చింది. కేవలం 10 నుంచి 15 మందిపై మాత్రమే గుడ్ రిపోర్టు వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బ్యాడ్ రిపోర్ట్ వచ్చిన డివిజన్లలో పార్టీ బలంగానే ఉన్న కొందరు కార్పొరేటర్లు భూ దందాలు, భూ తగాదాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణల వల్ల వారిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన సర్వే రిపోర్టులు గులాబీ బాస్కు చేరడంతో ఇప్పుడు కార్పొరేటర్ల గుండెల్లో గుబులు పట్టుకుంది.
బాస్ డైరెక్షన్లో అభివృద్ధిపై ఫోకస్..
దీంతో త్వరలో జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ బాస్.. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కు దిశా నిర్ధేశం చేసినట్లు తెలిసింది. దాంతో తన నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారట. అలాగే ప్రజాభిమానం చూరగొనేలా నేతలు ప్రజా క్షేత్రంలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి వాటిని పరిష్కరించే ప్రయతాలు చేసేలా కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలని సూచించారట. ప్రభుత్వం అములు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని గులాబీ బాస్ అక్కడి జిల్లా నేతలతో మాట్లాడినట్లు టాక్ వినిపిస్తోంది.