ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో జాప్యానికి సంబంధించి వివేకా కుమార్తె సునీత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. తన తండ్రి దారుణ హత్యకు గురై రెండేళ్లవుతున్నా ఇంకా దోషులను పట్టుకోకపోవడంపై సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని సీబీఐ అధికారులను కలిసిన అనంతరం మాట్లాడుతూ ఈ కేసులో విచారణలో జాప్యంపై ప్రశ్నించారు.
హత్య మిస్టరీగానే మిగిలింది
తన తండ్రి హత్య మిస్టరీగానే మిగిలిందని, ఇలాగే జాప్యం జరిగితే సాక్ష్యాలూ తారుమారు చేస్తారన్న అనుమానం వ్యక్తం చేశారు. దోషులను పట్టుకోకపోతే ఇలాంటి సంస్కృతి పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు.మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సునీత. ఈ కేసు విచారణలో భాగంగా తాను సీనియర్ అధికారిని కలిసినప్పుడు ఇలాంటి హత్యలు కడప, కర్నూలులో సాధారణమని వ్యాఖ్యానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిందేదో జరిగిందని, వదిలేయాలన్న అర్థం వచ్చేలా మాట్లాడడం సరికాదన్నారు. నువ్వు పోరాడితే నీ పిల్లలపైనా ప్రభావం పడుతుందని అన్నారని తెలిపారు. ఈ కేసుకు సంబంధం ఉన్న సాక్షులు రకరకాల కారణాలతో చనిపోతున్నారని ఆరోపించారు. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న శ్రీనివాస్రెడ్డి 2019 సెప్టెంబరులో ఆత్మహత్య కేసుకుని చనిపోయాడు. ఇక్కడే సునీతకు పలు అనుమానాలు తలెత్తినట్టు భావించవచ్చు. అదే సమయంలో బెదిరింపు కోణం తెరపైకి వస్తోంది.

రవి హత్య కేసులో నిందితులు హత్యకు గురై..
ఈ క్రమంలోనే పరిటాల రవి హత్యకేసు నిందితుల్లో కొంత మంది హత్యకు గురైన ఘటననూ గుర్తు చేస్తున్నారు కొందరు నాయకులు. 2005జనవరి 25న పరిటాల రవి హత్య జరిగింది. ఈ కేసులో చానాళ్లపాటు విచారణ జరిగింది. అయితే ముగ్గురు ప్రధాన నిందితులు మద్దెలచెర్వు సూరి, మొద్దు శీను, తరగకుండ కొండారెడ్డిలు హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాజకీయంగా పలు అనుమానాలూ తలెత్తాయి. కీలకమైన నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు హత్యకు గురికావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది.
వివేకా హత్య అనంతరం..విచారణ ఇలా..
2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లో హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా వైసీపీ నాయకులు ప్రకటించారు. అయితే వివేకా ఒంటిపై గాయాలుండడంతో పలు అనుమానాలు తలెత్తాయి. దీంతో రాజకీయంగా అప్పట్లో పెద్ద దుమారం తలెత్తింది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీపై విమర్శలు చేసింది. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బాబాయి వివేకానంద హత్యపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. పలువురిని విచారించినప్పటికీ కేసు కొలిక్కిరాలేదు. ఎన్నికల అనంతరం జగన్ సీఎం అయ్యారు. మరో ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేశారు. పలువురు అనుమానితులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించింది. అయితే కేసు కొలిక్కి రాకపోవడంతో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
ఆ సమయంలోనే గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ జగన్ వేసిన పిటిషన్ను ఆయనే ఉపసంహరించుకోవడం చర్చకు కారణమైంది. ఈ కేసుతో సునీత తరఫు లాయర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించిన రికార్డుల అప్పగింతకు సంబంధించి సీబీఐ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో హైకోర్టు.. వివేకా హత్య కేసుకు సంబంధించి రికార్డులు ఇవ్వాలని మరోసారి హైకోర్టు స్థానిక పులివెందుల మెజిస్ట్రేట్ కు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి విచారణ నడుస్తోంది. మొదటి విడత విచారణ పూర్తయ్యాక మరో టీం వచ్చింది. 2020 సెప్టెంబరులో రెండో విడత విచారణ మొదలైనా కేసులో పురోగతి కనిపించలేదు. ఈ కేసులో దాదాపు 1300 మంది అనుమానితులు, సాక్షులను విచారించినా.. కచ్చితమైన ఆధారాలు మాత్రం దొరకలేదు.
జోమున్ని కలిసిన సునీత
ఇక గత జనవరిలో సునీత సిస్టర్ అభయ హత్య కేసులో విచారణ జరిగేలా పోరాడి నిందితులకు శిక్షపడేలా చేసిన సామాజిక కార్యకర్త జోమున్ ను కలిసి హత్య కేసును వివరించారు. సిస్టర్ అభయది ఆత్మహత్యేనని పోలీసులు కేసును మూసివేయించగా.. ప్రజలతో కలిసి ఉద్యమించిన జోమున్.. సాక్ష్యాధారాలను సేకరించారు. ఈ క్రమంలో ఆయనపై హత్యాయత్నం సైతం జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సునీత ధిల్లీలో సీబీఐ అధికారులను కలవడం ప్రాధాన్యం సంతరించుకోవడమే కాదు.. పరోక్షంగా బెదిరింపులు, నిందితుల మరణాల విషయాన్ని ప్రస్తావించడం, బెదింపుల అంశాన్ని ప్రస్తావించడం సంచలనం రేపింది. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది చూడాలి.
Also Read:పరిటాల శ్రీరామ్పై మరో కేసు నమోదు..











