తమిళ స్టార్ డైరెక్టర్ కె.యస్ .రవికుమార్ కి, సూపర్ స్టార్ రజనీకాంత్ తో మంచి ర్యాపో ఉంది. ‘ముత్తు’ సినిమా నుంచి ‘లింగ’ వరకూ ఆ బంధం కొనసాగింది. అయితే ‘లింగ’ నిర్మాతలకు బాగా నష్టం కలిగించడంతో … రవికుమార్ , రజనీకాంత్ ల రిలేషన్ కి బ్రేక్ పడింది. అంతకు ముందే అంటే.. 2010లో రోబో సినిమా విడుదలయ్యాకా.. రజనీకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. చాలా రోజులపాటు హాస్పిటల్ లో ఉన్నారు. నిజానికి ఆ సమయంలో రజనీకాంత్ ఇక సినిమాల్లో నటించరు అనే పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత రెండేళ్ళ వరకూ రజనీ ఏ సినిమాల్లోనూ నటించలేదు. షారుఖ్ ఖాన్ రావన్ లో అతిథి పాత్ర చేశారు, అలాగే కూతురు సౌందర్య డైరెక్షన్ లో కొచ్చడయాన్ యానిమేషన్ మూవీకి తన కంట్రిబ్యూషన్ ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో సినిమాల్లో మాత్రం నటించలేదు.
నిజానికి కె.యస్.రవికుమార్ రజనీకాంత్ తో ‘రోబో’ తర్వాత ‘రాణా’ అనే జానపద మూవీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేశాడు. భారీ బడ్జెట్ తో , దీపికా పదుకొణే హీరోయిన్ గా సినిమాని తెరకెక్కించాలని ప్రయత్నించాడు. అప్పట్లో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. అయితే రజనీ ఆరోగ్య సమస్యల కారణంగా అప్పట్లో కె.యస్ ఆ ప్రాజెక్ట్ ని పక్కనపెట్టాడు .. ఆ తర్వాత ఆయన కోలుకున్నాకా .. వేరే కథతో .. ‘లింగ’ సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా అనుకున్న రీతిలో అభిమానుల్ని అలరించకపోవడంతో.. ఆ తర్వాత కూడా రజనీ ఇక నటించరు అనే వార్తలొచ్చాయి. కానీ పా రంజిత్ దర్శకత్వంలో ‘కబాలీ, కాలా’ సినిమాలు విడుదలయ్యాయి. అలాగే శంకర్ 2.0, కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో పేట్టా , మురుగదాస్ దర్బార్ సినిమాల్లో రజినీ నటించి సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో రజినీ .. ‘అన్నాత్త’లో నటిస్తున్నారు.
మళ్ళీ ఇన్నాళ్ళకు ఇప్పుడు కె.యస్ రవికుమార్ అప్పట్లో పక్కన పెట్టిన ‘రాణా’ సినిమాని .. తిరిగి ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. రీసెంట్ గా రజనీని కలిసిన కె.యస్ .రవికుమార్.. ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాడట. ఈ టైమ్ లో ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందా అని రజనీ.. కె.యస్ ను అడిగారట. ఈ సమయంలో అయితే .. ఆ ప్రాజెక్ట్ కు మరింత బాగా చేయొచ్చని కె.యస్ ఆయన్ను కన్విన్స్ చేశారట. ప్రస్తుతం రజనీ .. రాజకీయాలతో బిజీగా ఉన్నారు కాబట్టి.. వచ్చే ఏడాది ఆ సినిమా కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయంటున్నారు.
జానపద జోనర్ లో తెరకెక్కే రానా సినిమా నిర్మాణానికి .. 2010 లోనే చాలా బడ్జెట్ ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాంటిది.. దాదాపు పదేళ్ళ తర్వాత అంటే.. . 2021 లో నిర్మించాలనుకుంటున్న ఈ సినిమాకి అందుకు ఎన్నో రెట్లు బట్జెట్ పెట్టాల్సి ఉంటుంది. అందులో సీజీ వర్క్ కే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి… ఈ సినిమాను ఖచ్చితంగా పాన్ ఇండియా కేటగిరిలోనే నిర్మించాలి. మరి రజనీతో ఇప్పుడున్న పరిస్థితుల్లో జానపద చిత్రం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.











