-ఆర్కే వల్ల వైకాపాకి, మంగళగిరికి జరిగిన నష్టం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన చిరంజీవి
-నారా లోకేష్పైనా ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్న వైకాపా ఇన్చార్జి
మంగళగిరి నియోజకవర్గంలో వైకాపా ఇన్చార్జి గంజి చిరంజీవి తన సత్తా చాటుతున్నారు. ప్రధాన ప్రత్యర్థి నారా లోకేష్పైనా, వైకాపాని వీడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. నాలుగున్నరేళ్లు పదవి అనుభవించి, వైకాపా అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అవినీతిని గంజి బలంగా ప్రశ్నిస్తున్నారు. ఆర్కే చేసిన అభివృద్ధి గురించి మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఇంట్లో సొమ్ములు ఏమైనా తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టాడా అంటూ నిలదీశాడు. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం ఆర్కే చేసిన వ్యక్తిగత అభివృద్ధి ఎలా అవుతుందంటూ ప్రశ్నించాడు. లేటుగా చేరినా లేటెస్ట్గా వైకాపాలో తిరుగులేని పట్టు సాధించాడు. ఆర్కే సీఎం జగన్ రెడ్డిని నోటికొచ్చినట్టు తిట్టి బయటకి పోయిన అంశాన్ని వైకాపాలో అన్నివర్గాలకు వివరించి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ద్రోహిగా చిత్రీకరించడంలో గంజి విజయవంతం అయ్యారు. మరోవైపు నారా లోకేష్ని కూడా గంజి టార్గెట్ చేశాడు. తాను లోకల్ అంటూ, లోకేష్ నాన్ లోకల్ అంటూ అతి పెద్ద ప్రచారానికి తెరలేపాడు. వాస్తవంగా గంజి చిరంజీవి తెలంగాణ నుంచి వచ్చి మంగళగిరిలో స్థిరపడ్డారు. కానీ తాను లోకల్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.