పిల్ల చచ్చినా పురిటి కంపు పోలేదని మనకో సామెత ఉండనే ఉంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసినా ఇంకా ఆ కంపు అలానే ఉంది. జనానికి అది ఇంపులా అనిపించకపోబట్టే కంపు అనాల్సి వస్తోంది.
మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్.. ఇదో బ్రేకింగ్ న్యూస్. తాను ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వలేదని చిరంజీవి అన్నారట. ఇక నుంచి కలిసి కట్టుగా ఉందాం అంటూ ‘మంచు’ మైక్ లో చెబుతున్నారు. ఇవన్నీ ఎవరికి అవసరం? ఇంకా ఎంతకాలం?. ఇప్పటికే జనం విసుగెత్తి ఉన్నారు. ఎన్నికలకు ముందే మెగాస్టార్ చిరంజీవి ఈ మాట అని ఉండవచ్చు కదా.. అప్పుడు ఎందుకు అనలేదు.
ఆ ప్యానల్ ఓడిపోయింది కాబట్టి అలా అంటున్నారు అని జనం అనుకోరా? ఫోన్ చేసి మాట్లాడటం వరకూ ఓకే.. తాను ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వలేదని చిరంజీవి అనడం సబబు కానే కాదు. తాను ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు మెగాస్టార్ దృష్టికా ఇప్పటిదాకా రాలేదేమో.. ఇప్పుడు వచ్చాయి కాబట్టి స్పందించాల్సి వచ్చిందనుకోవాలి.
‘అన్న’ మాట జవదాటారా?
చిరంజీవి శ్రీరామచంద్రుడైతే అన్న మాటను జవదాటని లక్ష్మణుడు నాగబాబు. ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఇస్తున్నారని మీడియా ముఖంగా నాగబాబు ఎందుకు చెప్పినట్టు? నాగబాబు ఆ మాట అన్నారంటే అది అన్నమాటే అయి ఉంటుంది కదా. కానప్పుడు మెగాస్టార్ ఎందుకు గళం విప్పలేదు? మంచు విష్ణు ఈ మధ్య మాట్లాడుతూ తనను పోటీ నుంచి తప్పుకోమని చిరంజీవి అన్నట్టు చెప్పారు. అదే నిజమైతే ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉన్నట్టే కదా. అసలు విష్ణు ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పే బదులు చిరంజీవి అలా అడిగనప్పుడే చెప్పి ఉంటే బాగుండేమో కదా. హీరోలను జనం ఇప్పటిదాకా హీరోల్లా చూస్తూ వచ్చారు.. వారిలో ఇలాంటి కుళ్లు రాజీకీయాలు ఉంటాయని ఇప్పుడు అర్థమవుతోంది.
అలై బలై కార్యక్రమానికి మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ హాజరై ఎడమొహం పెడమొహంగా ఉన్నారన్నది మరో వార్త. అసలు ఈ ఎన్నికల్లో ఓ అదృశ్య శక్తి వెనక ఉందనేది ఇంకో వార్త. కమ్మ, రెడ్లు కలిసి కాపు వర్గాన్ని ఓడించడం ద్వారా రేపటి రాజకీయ ప్రయోజనాన్ని ఆ అదృశ్య శక్తి ఆశించిందని మరో వార్త. ఈ రెండు వర్గాలూ ఎవరూ తక్కువ తినలేదని ఈ వార్తలన్నిటి సారాంశం. అందరూ య‘మా’ నటించేస్తున్నారు.. ఏడుపులు పెడబొబ్బలు కూడా పెట్టేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ వస్తే అసలు బండారం బయటపడిపోతుందట. ప్రాంతీయ వాదం, జాతీయవాదం దాకా ఈ మా ఎన్నికలు వెళ్లాయంటే ఇది మామూలు యవ్వారం కాదు కదా.
సిని‘మా’ ప్రమాణ స్వీకారం ఇదా?
నిన్న జరిగిన మా పాలక వర్గం ప్రమాణ స్వీకార వైభవం చూస్తుంటే స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటలో జరిగే వైభవం గుర్తుకొచ్చింది. ఈ బ్యాండు మేళాలు ఎందుకో? మాటలతో వాయించారు కదా… ఇంకా బ్యాండు మేళాల వాయింపుడు కావాలా నాయనా? ప్రకాష్ రాజ్ ప్యానల్ పెట్టారు. తన ప్యానల్ తో కలిసి మీడియా మీటింగ్ పెట్టి మా మసక బారిందని అంటే నరేష్ కౌంటర్ ఇచ్చారు. మా తెగ వెలిగిపోయిందని చెప్పారు. ఆ తర్వాత మాటల యుద్దాలు జరిగాయి. చివరికి ఫలితాలు వచ్చాక ఓడిపోయామని తెలిసింది.
ఓటమిని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత సైలెంట్ అయిపోవాలి కదా. మీ సమక్షంలోనే కౌంటింగ్ జరిగింది కదా. ఒకవేళ మీరు గెలిచి ఉంటే ఇలాగే వ్యవహరించేవారా? ఓడిపోయామన్న అక్కసుతో రిజైన్ చేయడం, చేయించడం ఎంతవరకు సబబు? నేను ప్రాంతీయ వాదినా జాతీయ వాదినా తేల్చండని ప్రకాష్ రాజ్ మంకు పట్టు పట్టారు. గెలిచిన వారు మాత్రం కలిసి పనిచేస్తామన్నారు.
అసలు ఏం సాధించాలనుకుంటున్నారో ప్రకాష్ రాజ్ వర్గానికి అర్థం కావడం లేదు. సభ్యుల సంక్షేమానికి పాటు పడాలనుకుంటే పదవులే అవసరం లేదు. వేషాలు దొరక్క బాధపడేవారు ఎంత మంది ఉన్నారు? వారందరికీ మీరు ఆసరా కల్పించండి. ఉపయోగం లేని ఈ పదవుల గురించి ఇంత రాద్దాంతం అవసరమా? మంచి చేయదలుచుకుంటే మా తరఫున మా క్యాంటీన్ నడపండి.. 24 క్రాఫ్ట్ ల వారికి ఒక పూట భోజనం పెట్టండి. బయట మీ గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
నాన్న గారి విషయానికే వద్దాం..
మా ఎన్నికల్లో గెలిచాక మంచు విష్ణు అన్న మాట ఈ గెలుపు తనది కాదట.. నాన్న గారిదట. నిజమే.. ఆయన తలచుకోబట్టే ముంబై నుంచి జెనీలియాని, ముఖేష్ రిషిని, బెంగళూరు నుంచి మాలాశ్రీని, ఢిల్లీ నుంచి జయప్రదనూ ఫ్లైట్ లో తీసుకు రాగలిగారు. ఎందుకంటే ప్రిస్టేజ్ ఇష్యూ. ఎన్నికల ముందు మాట్లాడమే కాకుండా ఎన్నికల తర్వాత ఇంకెంతో మాట్లాడతానని అన్నారు. అసలు ఏపీ ప్రభుత్వం మీద తనకున్న అభిప్రాయం కూడా చెప్పి ఉంటే బాగుండేది. తెలియాలి కదా.. అందుకే. వాళ్లకు సన్మానం చేయాలి? వీళ్లకు సన్మానం చేయాలి అని మోహన్ బాబు అంటున్నారు. సన్మానం చేస్తేనే ముఖ్యమంత్రులు కరుణిస్తారా?
అంతకుముందు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎవరు సన్మానం చేశారు? సన్మానం చేయమని అప్పటి కమిటీని ఎందుకు అడగలేదు? ‘బాలకృష్ణ అల్లుడిని మంగళగిరిలో ఓడించడానికి నేను ప్రచారం చేశాను.. అయినా నేనూ, మా అబ్బాయి వెళ్లి కలిస్తే బాలకృష్ణ చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుని తన ఆశీస్సులు మా అబ్బాయికి ఇచ్చాడు’ అన్నారు. అంటే ఈ విషయంలో మీ దగ్గర లేని వ్యక్తిత్వం బాలయ్యబాబు దగ్గరుందని భావించాల్సిందే కదా. ఇప్పుడు మా ఎన్నికల బంతి పోలీసులు, కోర్టు దాకా వెళ్లింది. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడక ముందే అంతా ఒక్కటిగా మారడం మంచింది. పంతాలు పట్టింపులకు సామరస్యంగా సర్దుకుపోవడమే అన్ని విధాలా ఉత్తమం.











