మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో చిరంజీవి భేటీ అయ్యారు. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.
హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్ లా ఉండడం అభిమానులు గమనించి ఏమైందని చిరంజీవిని ప్రశ్నించగా చిరంజీవి అసలు విషయం చెప్పారు. తన అరచేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని మెగాస్టార్ వెల్లడించారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం తిమ్మిరి ఏర్పడుతున్నట్టు అనిపించడంతో డాక్టర్ ను సంప్రదించానని వెల్లడించారు. అయితే కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని, దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు చెప్పారు.
అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని, 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని వివరించారు. ఈ సర్జరీ జరిగిన పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యధావిధిగా పని చేస్తుందని, దర్శకుడు విజయబాపినీడు అల్లుడైన సుధాకర్ రెడ్డి తనకు ఎంతో కాలంగా పరిచయం ఉండడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సర్జరీ పూర్తి చేసినట్లు చెప్పారు.
ఈ సర్జరీ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కి కూడా గ్యాప్ ఇచ్చానని వెల్లడించారు. చేయాల్సిన ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేసి ఈ 15 రోజులు గ్యాప్ తీసుకుంటున్నాని, నవంబరు ఒకటో తారీకు నుంచి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటానన్నారు. ప్రస్తుతానికి అంతా సెట్ అయింది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని మెగాస్టార్ అభిమానులతో పేర్కొన్నారు.