Mistake Pushed Jyotiraditya Scindia In Trouble :
ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ ను బుధవారం సాయంత్రం పునర్వవస్థీకరించారు. తన కేబినెట్ లోని పలువురు సీనియర్లకు వీడ్కోలు పలికిన మోదీ.. 36 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్త మంత్రులతో పాటు ప్రమోట్ అయిన మంత్రులతోనూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.
డిమాండ్ చేసి కేబినెట్ లో బెర్తు సాధించి..
ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో ఉండి.. ఇటీవలే హస్తం పార్టీకి హ్యాండిచ్చేసి బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి దక్కితేనే పార్టీలోకి వస్తానని సింధియా పెట్టిన కండీషన్ కు మోదీ ఓకే అన్నాకే.. ఆయన పార్టీ మారారన్న వాదనలు వినిపించాయి. తన డిమాండ్ మేరకు సింధియా మంత్రి పదవిని దక్కించుకున్నారు. మోదీ కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయనకు ఏకంగా కేబినెట్ ర్యాంకు దక్కింది.
ఆ మాత్రం తెలియదా?
ఈ క్రమంలో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా అదేదో.. కేంద్ర మంత్రి పదవి కొత్తదైనట్లుగా సింధియా వ్యవహరించిన తీరు ఆసక్తి రేకెత్తించింది. ముందుగా తన పేరు పిలవగానే ప్రమాణం చేసేందుకు వెళ్లిన సింధియా.. ప్రమాణం చేశాక.. రిజిస్టర్ లో సంతకం చేశాక.. సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతికి నమస్కారం పెట్టే విషయాన్ని మరిచారు. తనకు నమస్కారం పెడతారని సింధియా(Jyotiraditya Scindia) వంక రాష్ట్రపతి చూస్తున్నా.. అసలు సింధియా పట్టించుకోలేదు. నేరుగా మోదీ, ఆయన పక్కనే ఉన్న ఉపరాష్ట్రపతికి నమస్కారం చేసి… ఈ కార్యక్రమానికి హాజరైన వారికి కూడా నమస్కారం పెట్టేసి తన కుర్చీ వైపు వెళ్లిపోయారు. అయితే తన కుర్చీ వద్ద ఎవరో ఈ విషయాన్ని గుర్తు చేస్తే… పరుగు పరుగున వెనక్కి వచ్చి రాష్ట్రపతికి నమస్కారం చేశారు. ఈ ఘటనను చూసిన వారంతా.. కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ హయాంలో పనిచేసిన సింధియాకు ఈ మాత్రం సంప్రదాయం తెలియదా? అంటూ విసుర్లు సంధించారు.
Must Read ;- మోదీ కొత్త జట్టు.. 12 మంది అవుట్, 43 మంది ఇన్











