Kambhampati Haribabu :
నిజమే.. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఈ దఫా కూడా తెలుగు నేలకు చెందిన నేతలకు చోటు దక్కే ఛాన్స్ లేదనే చెప్పాలి. ఎందుకంటే.. కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్న వేళ ఇప్పటికే గవర్నర్ గా తెలుగు నేలకు చెందిన బండారు దత్తాత్రేయ కొనసాగుతుండగా.. తాజాగా ఏపీ కోటాలో విశాఖపట్నం మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబుకు కూడా కేంద్రం గవర్నర్ పదవిని కట్టబెట్టింది. మిజోరం గవర్నర్ గా హరిబాబును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దత్తాత్రేయను హరియాణా గవర్నర్ గా మార్చింది.
హిమాచల్ నుంచి హరియాణాకు దత్తన్న..
కేంద్ర మంత్రివర్గం పునర్వవస్థీకరణకు కసరత్తులు పూర్తి చేసిన మోదీ.. ఉన్నట్టుంది మంగళవారం పలు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్ లను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో హరిబాబు, దత్తాత్రేయలతో పాటు బీజేపీకి చెందిన కీలక నేతలు థావర్ చంద్ గెహ్లాట్, రమేశ్ బైస్, రాజేంద్ర విశ్వనాథ్, మంగూభాయ్ ఛగన్ భాయ్ పటేల్, శ్రీధరన్ పిళ్లై, సత్యదేవ్ నారాయణ్లు ఉన్నారు. దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ నుంచి హరియాణాకు మార్చిన కేంద్రం.. హిమాచల్ కు రాజేంద్ర విశ్వనాథ్ ను నియమించింది.
చిన్న రాష్ట్రానికే హరిబాబు (Kambhampati Haribabu)
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కొనసాగుతున్న దత్తాత్రేయను కీలకమైన హరియాణాకు గవర్నర్ గా మార్పు చేశారు. గవర్నర్ ల జాబితాలోకి కొత్తగా చేరిన హరిబాబును చిన్న రాష్ట్రం అయిన మిజోరంకు కేటాయించారు. ఇలా కేంద్రమంత్రి వర్గం పునర్వవస్థీకరణకు రంగం సిద్ధమైన వేళ.. హరిబాబును కొత్తగా గవర్నర్ గిరీ కట్టబెట్టడం, దత్తాత్రేయను కీలక రాష్ట్రమైన హరియాణాకు మార్పు చేయడంతో ఇక కేంద్ర మంత్రివర్గంలో తెలుగు నేలకు చెందిన నేతలకు అవకాశం లేదన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
వెంకయ్యతో సాన్నిహిత్యంతోనే..
ఇదిలా ఉంటే.. బీజేపీలో కీలక నేతగా వ్యవహరించిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడితో సాన్నిహిత్యం కారణంగానే కంభంపాటికి గవర్నర్ పదవి దక్కిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వెంకయ్యతో కంభంపాటికి అత్యంత సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఎదిగిన కంభంపాటి.. ఓ దఫా రాష్ట్ర బీజేపీ శాఖకు అధ్యక్షుడిగానూ పనిచేశారు. విశాఖ ఎంపీగా కంభంపాటికి సీటు దక్కే విషయంలోనూ వెంకయ్య మద్దతు ఉందన్న వాదనలూ లేకపోలేదు. మొత్తంగా వెంకయ్యతో కంభంపాటి కొనసాగిస్తున్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఇప్పుడు ఆయనకు గవర్నర్ పదవి దక్కిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కొత్త గవర్నర్ ల జాబితా ఇదే..
కంభంపాటి హరిబాబు (మిజోరం)
బండారు దత్తాత్రేయ (హరియాణా)
మంగూభాయ్ ఛగన్ భాయ్ పటేల్ (మధ్యప్రదేశ్)
థావర్ చంద్ గెహ్లాట్ (కర్ణకాట)
శ్రీధరన్ పిళ్లే (గోవా)
సత్యదేశ్ నారాయణ్ (త్రిపుర)
రాజేంద్ర విశ్వనాథ్ (హిమాచల్ ప్రదేశ్)
రమేవ్ బైస్ (జార్ఖండ్)
Must Read ;- దీదీ ఫార్ములాతో బీజేపీతో ఢీ.. పీకే కొత్త వ్యూహం











