( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇద్దరూ బిక్కవోలు లక్ష్మీ గణపతి సాక్షిగా సత్య ప్రమాణాలు చేశారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటువంటి మరో ఘటన విశాఖలో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వానికి విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెర లేపారు. తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు. తాను అమితంగా విశ్వసించే షిరిడి సాయిబాబాపై ప్రమాణం చేసి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

వెలగపూడి సవాల్..
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నిప్పులు చెరిగారు. విజయసాయిరెడ్డి ఆరోపణలకు ఘాటైన సమాధానం ఇచ్చారు. తనకు బినామీల పేరిట ఆస్తులు ఉన్నాయని చేసిన ఆరోపణలపై సవాల్ విసిరారు. ఆర్థిక నేరాల్లో ఆరితేరిన వ్యక్తి, సూట్కేస్ కంపెనీల అధినేత, ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి.. తన చరిత్ర ఏంటో, నా చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఎక్కడో బినామీల పేరిట తనకు ఆస్తులు ఉన్నాయని చేసిన ఆరోపణలపై ఈస్ట్ పాయింట్ కాలనీ షిరిడి సాయిపై సత్య ప్రమాణం చేసి, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విచారణ చేయించగల దమ్ముందా అని ప్రశ్నించారు. తనకు ఎంపీపై నమ్మకం లేదని, భగవంతుడిపై ప్రమాణం చేసి, వంద రూపాయల స్టాంప్ పేపర్పై సంతకం చేసి విచారణ చేపడితే, ఎటువంటి చర్యలకైనా తాను సిద్ధమని తెలిపారు. తన పేరిట, తన బంధువుల పేరిట అంగుళం భూమి ఉన్నట్టు నిరూపించినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి నిరూపించ లేకుంటే పదవీ కాలం ముగిసే వరకు ఎంపీగా కొనసాగవచ్చని చెప్పారు. ఎంవిపి కాలనీలో వుడా అప్రూవల్ 189 గజాల్లో డుప్లెక్స్ హౌస్ మినహా, ఇతర ఆస్తులు లేవన్నారు. ఎంవిపి సెక్టార్ సిక్స్లో తాను ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు, ప్రహరీ కడుతుండగా అధికారులు అడ్డగించినట్టు విజయసాయిరెడ్డి ప్రకటన విడుదల చేయడం సరికాదని అన్నారు. తనకు బినామీల పేరిట ఆస్తులు ఉంటే స్వాధీనం చేసుకుని పేదలకు పంచి పెట్టవచ్చని సూచించారు. అంతే కాని వాటిని కూడా కబ్జా చేయవద్దని అభ్యర్థించారు











