తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పుదుశ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో జరుగుతున్న పరిణామాలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. బీజేపీ సైద్ధాంతిక నినాదంగా చెప్పుకునే జైశ్రీరాంని ఇప్పటికే అక్కడ తెరపైకి తెచ్చిన బీజేపీ అన్ని రకాలుగా అధికార TMCని టార్గెట్ చేసింది. ఓ వైపు ఆపరేషన ఆకర్ష్ ద్వారా కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకోవడంతోపాటు పార్టీ నుంచి కీలక నేతలంతా రోజుకోప్రాంతంలో పర్యటనలూ చేస్తున్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మమత బెనర్జీపై విమర్శలు చేస్తున్నారు.
అదే సమయంలో కొన్ని సెంటిమెంట్లను కూడా తెరపైకి తెచ్చింది బీజేపీ. జైశ్రీరాం నినాదంతో పాటు బెంగాల్ను పాలించాల్సింది బెంగాల్ బిడ్డ మాత్రమే. మేనత్త కాదు.. (బెంగాల్ వాంట్స్ ఇట్స్ ఓన్ డాటర్.. నాట్ పిషి’-బెంగాల్ కుమార్తెను కోరుతోంది.. మేనత్తను కాదు) అని విమర్శలూ చేస్తోంది. మమత మేనల్లుడు అభిషేక్ని టార్గెట్ చేసింది. ఇప్పటికే అభిషేక్ బెనర్జీ కంపెనీలు, ఇళ్లపై సీబీఐ దాడులు జరగడంతో రాజకీయ రంగు పులుముకుంది. వాస్తవానికి బీజేపీ గతంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సెంటిమెంట్లను తెరపైకి తేలేదు. ప్రధానమైన సెంటిమెంట్ హిందూత్వను మాత్రమే ఎక్కువగా తెరపైకి తెచ్చేది. కాని పశ్చిమబెంగాల్లో ఆ పరిస్థితి లేదు. హిందూత్వ నినాదంతో మాత్రమే పార్టీ ముందుకు వెళ్తే నష్టం జరుగుతుందని బీజేపీ భావించిందని, అందుకు కారణం కొన్ని ప్రాంతాల్లో మైనార్టీ ఓట్లు గణనీయంగా ఉండడమేననే చర్చ నడుస్తోంది.
కౌంటర్ నినాదాలతో మమత రెడీ..
గతంలో అమిత్ షా ఓ సభలో మాట్లాడుతూ మమత బెనర్జీ చేత కూడా జై శ్రీరాం అనిపించి తీరుతామని వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. దీనిపై మమత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో గతంలో 2018లో శ్రీరామనవమి సందర్భంగా ఆసన్సోల్, రాణీగంజ్, పురులియా, 24 పరగనా జిల్లాల్లో జరిగిన హింసలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వైనాన్ని బీజేపీ తెరపైకి తెస్తోంది. ఆ నేపథ్యంలోనే 2019లో ఉత్తర 24 పరగనా జిల్లాతోపాటు తూర్పు మిదనాపూర్లో మమత బెనర్జీ కాన్వాయ్తో వెళ్తుండగా జైశ్రీరాం అంటూ ఏబీవీపీ, వీహెచ్పీ, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో టీఎంసీ మరో సెంటిమెంట్ను తెరపైకి తెచ్చింది. బెంగాలీలు కాళీమాతను, దుర్గామాతను పూజిస్తారని, జైశ్రీరాం అంటేనే హిందువులా అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాముడి పేరు ఎత్తుకుంటే, తృణమూల్ పోటీగా కృష్ణుడి పేరుతో నినాదం ఎత్తుకుంది. ‘జై శ్రీరాం’కు పోటీగా ‘హరే కృష్ణ హరే హరే… తృణమూల్ ఘోరే ఘోరే’ అని నినాదం చేస్తోంది. అదే సమయంలో రాముడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సొత్తు కాదని, రాముడిని ఎలా పూజించాలో ఎవరికి వారు నిర్ణయించుకుంటారని అని ఆ పార్టీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ గా పేరున్న మహువా మోయిత్రా గట్టి కౌంటర్ ఇచ్చారు.
పాలించాల్సి సొంత బిడ్డే..
దీంతో కొన్ని రోజుల తరువాత బీజేపీ మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. బెంగాల్ను పాలించాల్సింది సొంత బిడ్డ అని, మేనత్త కాదని నినాదాన్ని తెరపైకి తెచ్చింది. కౌంటర్గా మమతా బెనర్జీ..బెంగాల్ని గుజరాతీలు ఎప్పటికీ పాలించలేరని వ్యాఖ్యానించారు. ఇలా బీజేపీ చేస్తున్న ప్రతి నినాదానికి మమతా బెనర్జీ ప్రతినినాదం తెరపైకి తెస్తున్నారు. ఇక నేతాజీ జయంతిని కూడా రెండు పార్టీలు పోటాపోటీగా నిర్వహించడం వెనుక కూడా ఆదిపత్య పోరే కారణంగా కనిపిస్తోంది. కేంద్రం ప్రభుత్వం పరాక్రమ్ దివస్గా ప్రకటించిన వెంటనే మమత సర్కారు దేశ్ నాయక్ దివస్ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఇక్కడా లోకల్ ఫ్లేవర్ను మమత బెనర్జీ తెరపైకి తెచ్చారు.
అల్లరి దెయ్యం కామెంట్లపై బీజేపీ ఫైర్..
కాగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ముకుల్ రాయ్, సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీలను తమవైపు తిప్పుకుంది. ముకుల్ రాయ్ తృణమూల్లో కీలకంగా ఉండేవారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణం సమయంలో బయటకు వచ్చారు. నందిగ్రామ్లో వామపక్షాలను ఓడించే విషయంలో కీలకంగా వ్యవహరించిన సువేందు అధికారినీ బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. ప్రస్తుతం ఈయనపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. దీనికి కౌంటర్గా మమత బెనర్జీ హుగ్లీలోని షాన్గంజ్లో మాట్లాడుతూ అబద్దాలను ప్రచారం చేయడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, వేరే పార్టీ నేతలను చేర్చుకోవడం, అల్లర్లను సృష్టించడమే బీజేపీ పని అని వ్యాఖ్యానించడంతోపాటు మోదీ, అమిత్ షా ద్వయాన్ని దంగాబాజ్, దైత్య(అల్లరి, దెయ్యం) అనే పదాలను వాడడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నన్ను పాతిబెట్టినా చెట్టులా విస్తరిస్తూ ఉంటానని, తాను మమతా బెనర్జీని అని గర్జించారు మమత.
సెంటిమెంట్ల వార్..
మొత్తం మీద గతంలో ఎన్నడూ, ఏ రాష్ట్రంలో లేని విధంగా పశ్చిమబెంగాల్ లో బీజేపీ వర్సెస్ మమత సెంటిమెంట్ల వార్ కొనసాగుతుంది. బీజేపీ రోజుకో సెంటిమెంట్ను తెరపైకి తెస్తోంది. అందుకు కారణం ఒక్కటే. హిందూత్వ నినాదంపై మాత్రమే ఆధారపడితే లాభం లేదనే ఆలోచనకు పార్టీ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. బెంగాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు 27.01 శాతంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ జనాభా 30 శాతానికి చేరిందని భావిస్తున్నారు. ఓటర్ల విషయానికి వస్తే.. ఇంకా ఎక్కువగానే ఉంటారనే అంచనాలున్నాయి.
బెంగాల్లో మైనార్టీ వర్గాలను జమీయత్ ఉలేమా-ఎ-హింద్, ఫుర్ఫురా షరీఫ్ సంస్థలు గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మమత వాటిపై ఆశపెట్టుకున్నారు. ఈ సంస్థల సూచనలతోనే గతంలో సచార్ కమిషన్ ద్వారా మైనార్టీలకు ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు మమత సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. ముర్షీదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్లో ముస్లింలు మొత్తం జనాభాలో సగం లేదా అంత కంటే ఎక్కువే ఉంటారు. వీటితోపాటు దక్షిణ, ఉత్తర 24 పరగణా జిల్లాల్లో ముస్లింల ప్రభావం గణనీయంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో 100కిపైగా స్థానాల్లో మైనార్టీ ఓట్లే గెలుపోటములు నిర్ణయిస్తాయనే అంచనా ఉంది. అందుకే మమత వీలైంతవరకు బీజేపీని మత కోణంలో మాత్రమే టార్గెట్ చేశారు. ప్రతిగా బీజేపీ పలు సెంటిమెంట్లను తెరపైకి తెచ్చింది.
ఓవైసీ విషయంలో..ఆచితూచి
అదే సమయంలో ఓవైసీ విషయంలోనూ మమత ఆచితూచి వ్యవహరిస్తోంది. గతనెలలో ఓవైసీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు మమత సర్కారు అనుమతి కూడా ఇవ్వలేదు. దీంతో ఓవైసీ మమతపై కొన్ని విమర్శలు చేశారు. అంటే మైనార్టీ ఓట్లను చీల్చే విధంగా ఎవరు వ్యవహరించినా మమత సహించే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఓవైసీ ప్రసంగాల తరహాలోనే మమత బెనర్జీ, టీఎంసీ నేతలు ప్రసంగాలూ చేస్తున్నారు. ఉర్దూ పదాలను వాడడం, అదే తరహాలో ప్రసంగాలు చేయడం కూడా జరుగుతోంది. తొలుత ఓవైసీ ఇక్కడ పోటీకి స్పీడుగా ఉన్నా..తరువాతి పరిణామాల నేపథ్యంలో స్పీడు తగ్గించారనే ప్రచారం జరుగుతోంది. తాము త్వరలోనే పొత్తులపై నిర్ణయం ప్రకటిస్తామని సోమవారం ఓవైసీ వ్యాఖ్యానించారు.