(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
అవి బంగారు కొండలు.. ప్లాటినం, గ్రాఫైట్, బాక్సైట్ నిధి నిక్షేపాలకు నిలయాలు. అయినా వాటిని దశాబ్దాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇదే అదనుగా పొరుగు రాష్ట్రం పాగా వేస్తోంది. పదే పదే మీడియా హెచ్చరిస్తున్నా, పక్క రాష్ట్రం కవ్విస్తున్నా ప్రభుత్వ స్పందన కరువవడంతో ఆ ప్రాతం మన నుండి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. అంత విలువైన ఆ ప్రాంతం మన రాష్ట్రంలోనే ఉందంటే మీరు ఆశ్చర్యపోతున్నారా..! అదేంటో, ఎక్కడో తెలుసుకోవాలని ఉందా ..!
మన రాష్ట్రంలో ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో (ఏఓబి) విజయనగరం జిల్లా సాలూరు ప్రాంత పరిధిలో ఎత్తైన కొండలపైన అత్యంత రమణీయంగా, ప్రకృతి సోయగాలతో పరవసింప జేస్తూ గలగలా పారే జలధారల మధ్య 21 గిరిజన గ్రామాలు ఉన్నాయి. డోలియాంబ, ముడకారు, కొఠియా, గంజాయిభద్ర తదితర గ్రామాలన్నీ కలిపి కొఠియా గ్రామాలుగా పేరు గాంచాయి. ఎన్నికల సమయంలో మినహా ఇతరత్రా వేళల్లో రాష్ట్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఈ కొండల్లో అత్యంత విలువైన నిధి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన ఒడిశా ప్రభుత్వం అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇటీవల సుమారు రూ . 200కోట్లు వెచ్చించి ఆ ప్రాంతంలో రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పన చేపట్టింది. సుదూరాన ఉన్న ఒడిశాలోని కొరాపుట్ ప్రాంతం నుండి ఆ రాష్ట్ర అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు ఆంధ్రా మీదుగా పయనిస్తూ అక్కడ పనులు చేస్తుంటే ఇక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రాంత గిరిజనులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిందిస్తూ, ఒడిశా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆకర్షితులవుతున్నారు. ఎవరు తమకు మెరుగైన మౌలిక వసతులు , సంక్షేమ పథకాలు అందజేస్తే వారికే తమ మద్దతు తెలియజేస్తామంటున్నారు.
ప్రతి ఒక్కరికీ రెండు ఓట్లు..రెండు రేషన్ కార్డులు
ఈ కొఠియా గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులందరికీ రెండేసి రేషన్ కార్డులు, రెండేసి ఓట్లు ఉంటాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ది కాగా, ఇంకొకటి ఒడిశాది. ఇక్కడ మన రాష్ట్రంతో పాటు ఒడిశా కూడా ఎన్నికలు నిర్వహిస్తుంటుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ అందజేస్తాయి. సరిహద్దు సమస్య పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపకపోవడంతో ఒడిశా ఏదోవిధంగా ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలని నిరంతర ప్రయత్నాలు చేస్తోంది.
సుప్రీంకోర్టు స్టేటస్కో
ఏఓబి సరిహద్దుల్లో ఉన్న కొఠియా ప్రాంతం తమదంటే తమదంటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టేటస్కో ఇచ్చింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. విలువైన నిధి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన ఒడిశా ప్రభుత్వం అక్కడ పాగా వేయాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
మావోయిస్టుల అడ్డాగా..
ఎత్తైన కొండలు , ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడుకున్న ఈ ప్రాంతం మావోయిస్టులకు అడ్డాగా మారినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితమే స్థానిక పోలీసు, నిఘా విభాగాలు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇక్కడ ఒడిశా దూకుడుతో పాటు మావోయిస్టుల అలజడి, ఇతర అంశాలను ప్రభుత్వానికి నివేదించి తక్షణ చర్యలు కోరినట్లు సమాచారం. ఈ విషయంలోనూ సర్కారు నుంచి సరైన స్పందన రాలేదని తెలిసింది. వేరొకవైపు మావోయిస్టు చర్యలను ఎదుర్కొనే పేరిట ఒడిశా సర్కారు ప్రత్యేక పోలీసు స్టేషన్ నిర్మాణం కూడా చేపడుతోంది. అంతే కాకుండా కొఠియా గ్రూప్ గ్రామాల్లో పోలీసు బెటాలియన్నూ ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తోందని సమాచారం.
తమ సొంత గడ్డపై పక్క రాష్ట్రం అనేక చర్యలు చేపడుతున్నా ఏపీ సర్కారు నుంచి సరైన స్పందన లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొనే చందంగా వ్యవహరిస్తే అసలుకే ముప్పు వస్తుందని ఆ ప్రాంత వాసులు చర్చించుకుంటున్నారు.











